ఆంధ్రప్రదేశ్తో పాటూ తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలు సహా 12 రాష్ట్రాల్లో రూ.25 వేల కోట్లతో పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం వచ్చే కేబినెట్ సమావేశంలో.. ఈ పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. కేంద్రం ఏర్పాటు చేసే ఈ పారిశ్రామిక నగరాల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించొచ్చని అంచనా వేస్తున్నారు.అదే కనుక జరిగితూ రాష్ట్రాలలో పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి సాధించొచ్చని చెబుతున్నారు.
ఈ పారిశ్రామిక నగరాలను విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. నివాస, వాణిజ్య మండళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రం పారిశ్రామిక నగరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ, బీహార్ తదితర రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్లోని ధొలేరా, గ్రేటర్నోయిడాలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక నగరాల తరహాలో వీటిని అభివృద్ధి చేస్తారని చెబుతున్నారు.
ఈ పారిశ్రామిక నగరాల్లో జౌళి, ఫ్యాబ్రికేషన్, ఆహారశుద్ధి, విద్యుత్తు వాహనాలు, విమానయాన విభాగాలు, పర్యాటక రంగాలకు సంబంధించిన పార్క్ల ఏర్పాటుకు అవకాశం ఉందంటున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతిని గణనీయంగా పెంచుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా దేశీయంగా తయారీని పెంచడంతో పాటుగా ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోంది. అయితే ఈ పారిశ్రామిక నగరాల ఏర్పాటుపై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్పమెంట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త పార్కులపై ప్రకటన చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కూడా పారిశ్రామిక పార్కులపై కేంద్ర పెద్దలతో చర్చించారు. కేంద్రం కూండా సానుకూలంగా స్పందించింది.. దీంతో ఈ జాబితాలో ఏపీని కూడా చేర్చారు. ఏపీకి పెట్టబడులు రప్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa