దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య కుదిరిన మీడియా, వ్యాపార విలీనం విషయంలో మరో కీలక ముందడుగు పడింది. మీడియా రంగంలో ఇది అతిపెద్ద విలీనం అని చెప్పొచ్చు. తాజాగా.. ఈ డీల్కు.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేసింది. అయితే.. విలీనానికి సంబంధించి.. ఈ రెండు అతిపెద్ద సంస్థలు 6 నెలల కిందటే ప్రకటన చేయగా.. ఇప్పుడు సీసీఐ ఆమోదం లభించింది. చిన్నపాటి మార్పులతో ఒప్పందానికి ఆమోదం తెలిపినట్లు సీసీఐ ఇప్పుడు ఎక్స్లో పోస్ట్ చేసింది.
'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా లిమిటెడ్, వయాకామ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలకు.. సంబంధిత ప్రతిపాదిత విలీనం ప్రక్రియ స్వచ్ఛంద సవరణకు లోబడి ఆమోదం పొందింది.' అని పేర్కొంది సీసీఐ. ఇక్కడ ఆ సవరణలు ఏంటి అనేది మాత్రం సీసీఐ వెల్లడించలేదు. ఈ అతిపెద్ద విలీనంతో పోటీపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చని సీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఆమోదం లభించడం గమనార్హం.
>> రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన వయాకామ్, వాల్ట్ డిస్నీ సంస్థకు చెందిన స్టార్ ఇండియా మధ్య 8.5 బిలియన్ డాలర్ల విలువైన విలీన ఒప్పందం ఈ ఏడాది ఆరంభంలో జరిగింది. ఇది భారత కరెన్సీలో ఏకంగా రూ. 70,550 కోట్ల వరకు ఉంటుంది. ఇక విలీనం పూర్తయిన తర్వాత.. మొత్తం 120 టెలివిజన్ ఛానెల్స్, రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్తో అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించబోతోంది.
విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు.. 63.16 శాతం వాటా దఖలు పడనుండగా.. వాల్ట్ డిస్నీ వాటా 36.84 శాతంగా ఉండనుంది. ఇక ఈ మీడియా వెంచర్కు ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఛైర్ పర్సన్గా వ్యవహరిస్తారని తెలిసింది. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్గా ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa