వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డులను వచ్చే నెల నుంచి జారీచేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడించనున్నామని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది సోమవారం వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన అగ్రి-టెక్ సమ్మిట్, స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చతుర్వేది మాట్లాడుతూ.. అక్టోబరు మొదటివారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది మార్చి కల్లా 5 కోట్ల మంది రైతులకు ఈ విశిష్ట గుర్తింపును ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్లో అమలు చేశామని, మరో 19 రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యం కావడానికి సమ్మతించాయని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఆధార్ తరహా ఐడీ కార్డులను అందజేస్తామని చతుర్వేది తెలిపారు. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ ఐడీ ద్వారా రైతులు తాము పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, కిసాన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చని వివరించారు.
వ్యవసాయ రంగం డిజిటైజేషన్ కోసం ఇటీవల కేంద్ర క్యాబినెట్ రూ.2,817 కోట్ల నిధులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రిజిస్ట్రీ ద్వారా సేకరించిన ఈ డేటా విధాన ప్రణాళిక, వ్యవసాయ రంగంలో సేవలలో ప్రభుత్వానికి సహకరిస్తుంది. ‘ప్రస్తుతం, రైతులు ఏదైనా వ్యవసాయ పథకం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ వెరిఫికేషన్కు వెళ్లాలి.. దీనికి ఖర్చు మాత్రమే కాకుండా కొంత వేధింపులు కూడా ఉంటాయి.. ఈ సమస్యను పరిష్కారానికి మేము రైతుల రిజిస్ట్రీని రూపొందించబోతున్నాం’ అని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వ వద్ద ఉన్న డేటా వ్యవసాయ భూములు, రాష్ట్రాలు అందించిన పంట వివరాలకే పరిమితమైందని, అయితే వ్యక్తిగత రైతుల వారీగా సమాచారం లేదని ఆయన అన్నారు. కొత్త రిజిస్ట్రీ ఈ అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని చతుర్వేది వివరించారు. విద్యావంతులైన రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్థలు.. ఈ నమోదు ప్రక్రియ గురించి అవగాహన కల్పించాలని, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని చతుర్వేది కోరారు. రిజిస్ట్రేషన్ డ్రైవ్ కోసం దేశవ్యాప్తంగా క్యాంపులు నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగానికి కిసాన్ ఏఐ చాట్బాక్స్ వ్యవస్థ సహా పలు సాంకేతికతలను జోడించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ డిజిటల్ సేవల మెరుగుదలకు రైతుల మద్దతు అవసరమని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa