అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. భారత్లోని రాజకీయాలు, మరీ ముఖ్యంగా గత 10 ఏళ్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అమెరికాలో చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ నేతలు అంతా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారాయి. ఇక భారత్లోని సిక్కులపై తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి.
రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యలను నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్-ఎస్ఎఫ్జే సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మద్దతుగా నిలిపాడు. గ్లోబల్ ఖలిస్థాన్ రెఫరెండం కోసం సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ చేస్తున్న ప్రచారానికి మద్దతు తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని పన్నూన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఖలిస్థాన్ ఏర్పాటుకు మద్దతుగా రాహుల్ గాంధీ మాట్లాడినట్లు పేర్కొన్నాడు.
‘‘భారత్లో సిక్కుల మనుగడకు ప్రమాదం" అనే అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతంగా, మార్గదర్శకంగా ఉన్నాయని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తెలిపాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి ఇప్పటివరకు జరిగిన పాలనలో సిక్కుల చరిత్రను తెలియజేస్తున్నాయని వెల్లడించాడు. అదే సమయంలో సిక్కులకు సొంత దేశం ఖలిస్థాన్ ఏర్పాటు చేసేందుకు పంజాబ్ ఇండిపెండెన్స్ రెఫరెండం చేపట్టాలన్న ఎస్ఎఫ్జే డిమాండ్కు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మద్దతుగా ఉన్నాయని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేర్కొన్నాడు.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వాషింగ్టన్ డీసీ శివార్లలోని హండన్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భారత అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే విషయాలపై భారత్లో ఘర్షణలు జరుగుతున్నాయని.. అక్కడ తలపాగా ధరించి ఉన్న ఓ వ్యక్తిని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. కేవలం సిక్కులకు మాత్రమే కాదని.. దాదాపు అన్ని మతాలకూ ఇదే పరిస్థితి తప్పడం లేదని చెప్పారు. అయితే సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఓ కార్యక్రమం చేపట్టారని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ ఎద్దేవా చేశారు. ఆ ఘటనలో 3వేల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అప్పట్లో సిక్కులు తలపాగాలు ధరించకుండా.. పూర్తిగా గడ్డం తీసేసి తిరగాల్సి వచ్చిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa