కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. శ్రీవారి వస్త్రాలంకార సేవ పేరుతో భక్తులను మోసగించిన వైనం వెలుగు చూసింది. గుంటూరు జిల్లాకు చెందిన భక్తులను ఓ దళారి మోసం చేసిన ఘటన బయటపడింది. గుంటూరు జిల్లా పట్టాభిపురానికి చెందిన కొంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారు. అయితే ఓ దళారి వస్త్రాలంకార సేవ పేరుతో వారిని మోసం చేశాడు. ఏడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న దళారి.. వారి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే మోసపోయామని గ్రహించిన బాధితులు.. తిరుమలలోని టూటౌన్ పౌలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దళారి బండారం బయటపడింది.
మరోవైపు వరుస సెలవులు రావటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శనివారం రోజు 80 వేల 735 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 40 వేల 524 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ద్వారా 3 కోట్ల 19 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ పెరగడంతో ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు కంపార్టుమెంట్ల నిండా భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ బయటి లైన్ వరకూ క్యూలైన్లు విస్తరించాయి.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. సెప్టెంబరు 17న అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తెల్లవారుజామున 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువస్తారు. అక్కడ శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అభిషేకం నిర్వహించి తిరిగి ఆలయానికి తీసుకెళ్తారు. మరోవైపు అనంత పద్మనాభస్వామి అవతారంలో ఉన్న విష్ణువును ప్రార్థిస్తూ దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవాలయాలలోనూ ఇదే రోజు అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహిస్తారు. మరోవైపు తిరుమలలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, శ్రీవారి బ్రహ్మోత్సవాల చివరిరోజు, అనంత పద్మనాభవ్రతం రోజుల్లో మాత్రమే పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa