ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బందికి రాత్రిపూట విధుల్లో నియమించొద్దని పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్రంగా మండిపడ్డారు. భద్రతను కల్పించడం ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వులను సవరించాలని బెంగాల్ సర్కారుకు సూచించారు. కోల్కతా ఆర్జ్ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా వైద్యులకు నైట్ డ్యూటీలు నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘మహిళలు రాత్రిపూట విధుల్లో ఉండొద్దని మీరు ఎలా చెబుతారు? మహిళా వైద్యులపై ఎందుకు పరిమితులు? వాళ్లు మినహాయింపులు కోరుకోవడం లేదు.. నైట్ డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని సీజే తీవ్ర స్వరంతో మాట్లాడారు. బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ఉద్దేశించి ‘మిస్టర్ సిబల్ మీరు దానిని చూడాలి.. దానికి సమాధానం తప్పక భద్రత ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్ నోటిఫికేషన్ను సవరించాలి.. భద్రత కల్పించడం మీ కర్తవ్యం, మహిళలు రాత్రిపూట పని చేయలేరని మీరు చెప్పలేరు.. పైలట్లు, సైనికులు మొదలైన వారంతా రాత్రి పని చేస్తారు’ అని పేర్కొన్నారు.
మహిళా వైద్యులు రాత్రిపూట విధులు నిర్వర్తించేందుకు అనువైన వాతావరణం లేకుంటే వారి కెరీర్కు విఘాతం కలుగుతుందని అన్నారు. దీనికి సిబల్ స్పందిస్తూ మీరు లేవనెత్తిన అంశాన్ని తొలగిస్తామని సీజేఐకు హామీ ఇచ్చారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బెంగాల్లో వైద్య విద్యార్థులు దాదాపు 40 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రుల్లో మహిళా వైద్యులకు రక్షణ కరువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్జీ కర్ ఆసుపత్రి అత్యాచారం-హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనల మధ్య, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ మహిళా వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వడానికి మార్గదర్శకాలను ప్రకటించారు. అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద మహిళలకు భద్రతను కల్పిస్తామని బందోపాధ్యాయ చెప్పారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద స్థానిక పోలీసులతో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రాత్రి విధుల్లో మహిళా వైద్యులు జంటగా పనిచేసే విధంగా షిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa