సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూ అంశంపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరో కార్తీ, తదితరులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో, కార్తీ వెంటనే పవన్ కు క్షమాపణలు తెలియజేశారు. ఓ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. డియర్ కార్తీ గారూ... మీరు చూపించిన సహృదయత, మన సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం, మీరు వెంటనే స్పందించిన తీరు పట్ల అభినందిస్తున్నాను. తిరుపతి పుణ్యక్షేత్రం, లడ్డూలు అనేవి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన తీవ్ర భావోద్వేగభరిత అంశాలు. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో అవసరం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకున్నానే తప్ప నాకు మరే ఉద్దేశం లేదు. మీ కార్యక్రమంలో లడ్డూ ప్రస్తావన కాకతాళీయంగా వచ్చిందన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులుగా మనం మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా ఐక్యతను, గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యతను కలిగి ఉండాలి. ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంతేకాదు, మీలోని నటనా ప్రతిభకు నేను అభిమానిని. మీరు అంకితభావంతో ఎంతో స్థిరంగా మన సినిమా రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఇక, మీ కొత్త చిత్రం 'సత్యం సుందరం' విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సూర్యా గారికి, జ్యోతిక గారికి, యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa