బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వరద పోటెత్తి జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఈ నేపథ్యంలోనే నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. మరో 17 మంది ఆ భవనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే శిథిలాలు తొలగించిన తర్వాత వాటి కింద ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
తూర్పు బెంగళూరులోని బాబుసపల్య ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటలకు చోటు చేసుకుంది. అక్కడ నిర్మిస్తున్న ఓ భారీ భవనం.. భారీ వర్షాల ధాటికి కూలిపోయింది. పిల్లర్లు పైకి లేచి.. అమాంతం ఆ బిల్డింగ్ పక్కకు పడిపోవడాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. భవనం కూలిన ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
భవనం శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించి బయటికి తీసుకువచ్చారు. ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద 17 మరో మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక గత 3 రోజుల నుంచి బెంగళూరు నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 27 ఏళ్లలో లేని వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 1997లో 178.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. తాజాగా 186.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa