సాధారణంగా దొంగలు అంటే జాలి, దయ కలగదు. పైపెచ్చు కాస్త కోపం కూడా కలుగుతుంది. కానీ.. ఇక్కడ చెప్పబోయే దొంగ విషయం తెలిస్తే మాత్రం.. అయ్యో పాపం అనుకోక తప్పదు. మనోడికి వచ్చిన కష్టం పగోడికి కూడా రావొద్దని అనిపిస్తుంది. విషయంలోకి వస్తే గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. తెనాలి రోడ్డులోని భాస్కర్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. బల్లపై ఉన్న స్మార్ట్ ఫోన్ దొంగిలించాడు. మెల్లగా ఇంట్లోకి దూరిన దొంగ.. ఎవరూ చూడకుండా ఇంట్లోని సెల్ ఫోన్ చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే పాపం ఆ తర్వాత జరగబోయే సంగతిని ఊహించలేకపోయాడు.
సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈ సెల్ఫోన్ చోరీకి పాల్పడ్డాడు. ఉదయం ఐదు గంటల సమయంలో సెల్ ఫోన్ చోరీ చేసిన సునీల్ కుమార్.. ఆ తర్వాత ఆ ఫోన్ ఎక్కడైనా అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడే ఆ ఫోన్ విక్రయించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పుడే ఊహించని ఘటన జరిగింది. మనోడికి దిమ్మతిరిగింది. ఎవరి ఫోన్ అయితే దొంగిలించాడో వారి దుకాణానికి వెళ్లిన విషయం పాపం మన దొంగ గారికి తెలియదు. వారికే సెల్ ఫోన్ విక్రయించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఫోన్ తమదే అని గుర్తించిన యజమాని.. దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఇక పోలీసుల విచారణలో మనోడి దొంగతనాల గురించి బయటకు వచ్చింది. తెల్లవారుజామున ఇళ్లు, ఆస్పత్రులలోకి వెళ్లి చోరీలు చేస్తున్న వైనం బయటకు వచ్చింది. దీంతో ఇంకా ఎక్కడైనా దొంగతనాలు చేశాడా అనే విషయంపై పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అయితే ఎక్కడైతే ఫోన్ కొట్టేశాడో వారికే అమ్మాలని చూసి దొరికిపోయిన విషయం తెలిసి స్థానికులు నవ్వుకుంటున్నారు. పక్కాగా ప్లాన్ చేసి దొంగతనం చేస్తే.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక దొంగ నేరచరిత్ర తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa