షరియత్ కౌన్సిల్ ప్రయివేట్ సంస్థ అని, అదేమీ న్యాయస్థానం కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి దానికి వివాహం రద్దుచేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ముస్లిం దంపతుల విడాకుల కేసులో సివిల్ రివిజన్ పిటిషన్పై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం విచారణ చేపట్టి.. ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. 2010లో వివాహం చేసుకున్న ముస్లిం జంట మధ్య విబేధాలు తలెత్తడంతో భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం తమిళనాడు షరియత్ కౌన్సిల్ తౌహిదీ్ జమాత్ 2017లో విడాకుల సర్టిఫికెట్ జారీచేసింది. వాస్తవానికి కుటుంబ, ఆర్ధిక సంబంధ సమస్యల పరిష్కారానికి సహకరించే షరియత్కు వివాహాన్ని రద్దుచేసే అధికారం లేకపోయినా విడాకులు పత్రం మంజూరు చేయడం గమనార్హం.
కేసు విచారణ సమయంలో షరియత్ కౌన్సిల్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ ఆర్ స్వామినాథన్.. ఇది దిగ్భ్రాంతికర అంశమని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో భర్త పిటిషన్ను అనుమతించిన కౌన్సిల్. మధ్యవర్తిత్వానికి ప్రయత్నించింది. కానీ, ఈ విషయంలో భార్య అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ‘కేవలం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన కోర్టులు మాత్రమే వివాహాన్ని రద్దుచేయగలం.. షరియత్ కౌన్సిల్ ఓ ప్రయివేట్ సంస్థ.. అది కోర్టు కాదు’ అని పునరుద్ఘాటించారు. భర్త దాఖలు చేసిన రివిజిన్ పిటిషన్ను తిరస్కరించారు.
న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు కానంత వరకూ వివాహం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. భర్తకు అనుకూలంగా షరియత్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సదరు భార్య సవాల్ చేస్తూ గృహహింస నిరోధక చట్టం కింద 2018లో పిటిషన్ దాఖలు చేశారు. ట్రిపుల్ తలాక్ చెప్పలేదంటే తనకు వివాహం ఇంకా చెల్లుబాటు అవుతుందని ఆమె వాదించారు. అయితే, అదే ఏడాది సదరు భర్త రెండో వివాహం చేసుకోవడం గమనార్హం. దీనిపై విచారణ చేపట్టిన తిరునల్వేలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 2021లో భార్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. మొదటి భార్యకు రూ.5 లక్షలతో పాటు కుమారుడి షోషణ కోసం నెలకు కింద రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించింది.
దీనిపై భర్త అప్పీల్కు వెళ్లగా కోర్టు తిర్కసరించడంతో ఆయన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో రివిజన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఆమెకు తాను మూడుసార్లు తలాక్ చెప్పానని వాదించారు. కానీ, అతడి వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. కింది కోర్టు ఆదేశాలను సమర్దించారు. అలాగే, ‘ఒక హిందూ, క్రిస్టియన్, పార్సీ లేదా యూదు భర్త మొదటి భార్య ఉండగానే విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నట్లయితే క్రూరత్వంగా పరిగణిస్తారు... గృహ హింస నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 12 కింద పరిహారం పొందేందుకు భార్యకు హక్కు కల్పించే గృహ హింస చర్యగా ఇది పరిగణించబడుతుంది. ముస్లింల విషయంలో ఈ ప్రతిపాదన వర్తిస్తుందా? అంటే అవుననేది సమాధానం ’ అని న్యాయమూర్తి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa