గత కొన్ని రోజులుగా వైఎస్ కుటుంబంలో తలెత్తిన ఆస్తుల పంపకాల విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటా పోటీగా లేఖలు విడుదల చేశారు. ఇక తన కుమార్తెకు మద్దతుగా వైఎస్ విజయమ్మ కూడా బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. మరోవైపు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాల విషయంపై విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వైఎస్ షర్మిలకు అండగా నిలుస్తూ ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిది అని తెలిపారు. ఆ నాయకుడి సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలని అంటున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల రాజకీయ విమర్శలు చేసినా.. ఆమెకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.
ఇక ఆస్తుల వాటా విషయంలో వైఎస్ షర్మిలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కుటుంబ ఆస్తుల వివాదం కాస్తా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు.. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి కారణం అయింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నెలకొంది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ నేతలు కూడా పరస్పరం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నారు. వైఎస్ షర్మిలపై పలువురు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తుండగా.. అంతే స్థాయిలో కాంగ్రెస్ సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ షర్మిలకు ప్రాణ హాని ఉందని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa