ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్స్ ట్రోఫీ .. ఒప్పుకోకపోతే వేరే దేశంలో టోర్నీ.. పీసీబీకి ఐసీసీ అల్టిమేటం

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 09:07 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ తేదీలు, వేదిక ఖరారు చేయడమే లక్ష్యంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ.. శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించింది. మొత్తంగా 15 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం తర్వాత టోర్నీ నిర్వహణ తేదీలపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ తుది నిర్ణయం తీసుకోకముందే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కానీ ఈ భేటీలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లు ఒప్పుకోకుండా మొండిపట్టుపడుతున్న పాకిస్థాన్‌కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.


 కాగా పాకిస్థాన్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా తాము ఆ దేశంలో పర్యటించబోమని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా శుక్రవారం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. ఇక శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశంలో ఆతిథ్య పాకిస్థాన్ మినహా టోర్నీలో పాల్గొనే మిగతా 7 దేశాలూ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాయట. దీంతో ఐసీసీ సభ్యదేశాలన్నీ కలిసి.. పాకిస్థాన్‌కు రెండో ఆప్షన్లు ఇచ్చాయని తెలుస్తోంది.


1.టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. భారత్ ఆడే మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి.


2. టోర్నీని పాకిస్థాన్ నుంచి తరలించడం.


ఈ రెండింట్లో దేనికి ఓకే చెబుతారో చెప్పాలని ఐసీసీ.. పీసీబీకి అల్టిమేటం జారీ చేసింది.


"భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహిస్తే.. బ్రాడ్ కాస్టర్లు ఒక్క రూపాయి కూడా ఐసీసీకి చెల్లించరు. ఈ విషయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలుసు. పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ.. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకుంటే శనివారం మరోసారి సమావేశం జరుగుతుంది. లేని పక్షంలో పాకిస్థాన్‌ కాకుండా వేరే దేశంలో టోర్నీ జరుగుతుంది. అందులో పాక్ ఆడకపోవచ్చు కూడా. ఈ నిర్ణయాలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందన కోసం వెయిట్ చేస్తున్నాం" అని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు వెల్లడించారు.


కాగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాక్ కొన్ని నెలల క్రితం సన్నాహకాలు ప్రారంభించింది. స్టేడియాలను అప్‌గ్రేడ్ చేసింది. ఒకవేళ టోర్నీని మరో దేశానికి తరలిస్తే.. ఆ బోర్డుకు రూ.296 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో టోర్నీ జరగాల్సి ఉంది. ఈ వారంతంలోగా వేదికను ఖరారు చేసి.. తుది షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com