ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ మాజీ మంత్రికి షాక్.. పేర్ని నాని భార్యపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 07:45 PM

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు.. మచిలీపట్నం పోలీసులు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంలోని పేర్ని నానికి చెందిన గోడౌన్‌‌ను ఏపీ పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకుంది. అయితే ఇందులో ఉంచిన రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. సుమారుగా 90 లక్షల విలువైన రేషన్ బియ్యానికి సంబంధించి.. లెక్కల్లో తప్పులు వచ్చాయి. దీంతో ఈ విషయం మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ మంజీర్ జిలానీ అధికారులను ఆదేశించారు.


అయితే ఈ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని వాదన మరోలా ఉంది.గోడౌన్‌లో ఉంచిన బియ్యాన్ని తరలించే సమయంలో తరుగు వచ్చిందని పేర్ని నాని చెప్తున్నారు. సుమారుగా 3,200 బస్తాలు తరుగు ఉన్నాయంటున్న పేర్ని నాని.. ఆ బియ్యానికి సంబంధించిన సొమ్మును చెల్లిస్తానని చెప్పారు. ఈ మేరకు నవంబర్ 27న పేర్ని నాని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌ గీతాంజలి శర్మకు లేఖ కూడా రాశారు. అయితే ఆ తర్వాతే పౌరసరఫరాల శాఖ అధికారులు గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. నవంబర్ 27. 28వ తేదీల్లో పేర్ని నాని గోడౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లో 3,700 బస్తాల బియ్యం తగ్గాయని గుర్తించారు. టన్నుల లెక్కన చూస్తే.. 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.


అయితే ఈ గోడౌన్‌ను పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట నిర్మించారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ గోడౌన్‌ను ఏపీ పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు రూ.5 వరకు అద్దె చెల్లిస్తోంది. అయితే ఈ గోడౌన్ నిర్వహణ ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటే.. పర్యవేక్షణ మాత్రం పౌరసరఫరాల సంస్థ చూసుకుంటుంది. మరోవైపు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిపై ఇప్పటికే సిట్ కూడా ఏర్పాటు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com