తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో శనివారం కడప బ్రౌన్ గ్రంథాలయంలో.. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తి శతజయంతి స్మారకోపన్యాస కార్యక్రమాన్ని జానమద్ది కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష వైభవం’ అనే అంశంపై జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. తెలుగు రాష్ర్టాల విభజనతో తెలుగు అతి త్వరగా మరుగునపడే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.
ఉద్యోగ ఉపాధి కోసం తెలుగును పూర్తిగా వదిలిపెట్టి ఇంగ్లీష్ కు అలవాటుపడుతున్నారన్నారు. తాను ఎన్నో దేశాల్లో చూశానని, అక్కడ ఇప్పటికీ వారి మాతృభాషలోనే బోధన జరుగుతోందని చెప్పారు. మాతృభాషలో ఉన్న అంశాలను నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తాను ఏడో తరగతికి వచ్చేంత వరకు ఇంగ్లీష్ నేర్చుకోలేదన్నారు. కానీ భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ, భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులాంటి వ్యక్తులు మాతృభాషలోనే చదివారని వివరించారు. పాఠశాలలో ఇంగ్లీష్ మాత్రమే బోధించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 585ను రద్దు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa