మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు.. మన వాహనం టైర్ పంక్చర్ అయితే కల్గే బాధే వేరు. అందులోనూ జన జీవన స్రవంతికి దూరంగా టైర్ పంక్చర్ అయినా, అర్ధరాత్రి ఇలాంటి ఘటన చోటుచేసుకున్న తెగ ఆందోళన పడిపోతూ ఉంటాం. దాన్ని బాగు చేయించుకుని వెళ్లేందుకు కనీసం రెండు, మూడు గంటల సమయం పట్టగా.. నరకం చూస్తుంటాం. అలాంటి బాధనే ఒకేసారి 50 మందికి పైగా అనుభవించారు. ఎందుకు అనుకుంటున్నారా.. ముంబయి-నాగ్పూర్ హైవేపై ఒకేసారి 50కి పైగా వాహనాలు పంక్చర్ అయ్యాయి. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబర్ 29వ తేదీ రోజు మహారాష్ట్రలోని వాషిం జిల్లా మాలెగావ్ వనోజా టోల్ ప్లాజా మధ్య కార్లు, ట్రక్కులు వరుసగా పంక్చర్ అయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో 50కి పైగా వాహనాలు వరుసగా పంక్చర్ కావడంతో.. ప్రయాణికులు అంతా భయభ్రాంతులకు గురయ్యారు. వారి వాహనాలు ఎలా పంక్చర్ అయ్యాయో తెలియక అయోమయం చెందారు. అందరికీ అలాగే జరుగుతుందని తెలుసుకుని మరింతగా భయపడిపోయారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో... పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
రోడ్డుపై పంక్చరైన వాహనాలను పక్కకు తీసుకు వెళ్లలేక వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే.. ట్రాఫిక్ సమస్యతో గమ్యస్థానాలకు చేరలేక మరికొంత మంది ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ వాహనాలను పక్కకు తరలించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. అయితే ఇన్ని వాహనాలు ఒకేసారి పంక్చర్ కావడానికి ఓ ఇనుప బోర్టు కారణం అని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ బోర్డు ప్రమాద వశాత్తు రోడ్డుపై పడిపోయిందా.. లేక ఎవరైనా కావాలనే అలా ప్రతీ వాహనానికి ఎదురుగా దాన్ని వేశారా అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కావాలనే ఎవరైనా ఇలా చేశారా లేక అనుకోకుండానే ఇది జరిగిందా అని తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొనగా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ముంబయి-నాగ్ పూర్ సమృద్ధి మహామార్గ్ ప్రస్తుతం పాక్షికంగా పని చేస్తోంది. ఇది మొత్తం ఆరు లేన్లలో విస్తరించి ఉండగా.. 701 కిలో మీటర్ల పొడవు ఉంది. అలాగే మూడు అతిపెద్ద నగరాలను కలుపుతూ దేశంలోని అతి పొడవైన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. మొత్తం 55 వేల కోట్లతో ఈ రహదారిని నిర్మించగా.. అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa