లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక వివరాలను సోమవారం వెల్లడించింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ పార్లమెంట్ స్థానంలో ఎక్కువ శాతం?.. ఎక్కడ తక్కువ ఓటింగ్ పోలైంది? ఎవరికి అత్యధిక మెజార్టీ వచ్చింది? తదితర గణాంకాలను ఈసీ బయటపెట్టింది. అత్యల్పంగా ఓటింగ్ నమోదైన తొలి రెండు పార్లమెంట్ స్థానాలు బిహార్లోనే ఉన్నాయి. అక్కడ నవాడలో (43.37 శాతం), పాట్నా సాహిబ్ (46.87 శాతం) ఓటింగ్ నమోదు కాగా... తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ నియోజకవర్గం (48.91 శాతం) మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మథుర (యూపీ), రేవా (మధ్యప్రదేశ్) సికింద్రాబాద్ (తెలంగాణ), ఘజియాబాద్ (యూపీ), నలంద (బిహార్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ స్థానాల్లో 50 శాతంలోపే పోలింగ్ నమోదయ్యింది.
హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ.. బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీ లత పోటీచేశారు. అక్కడ మెుత్తం 22,17,305 మంది ఓటర్లు ఉండగా.. 10,81,878 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి మాధవీ లతకు 3,23,894 ఓట్లు.. అసదుద్దీన్ ఒవైసీకి 6,61,981 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఒవైసీ 3,38,087 ఓట్ల భారీ మెజార్టీతో విజయ సాధించి.. గతంలో ఉన్న తన రికార్డును తానే బద్దలు కొట్టారు. సికింద్రాబాద్లో 21,20,550 మంది ఓటర్లు ఉండగా.. 10,48,604 మంది ఓటు వేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్పై గెలుపొందారు.
ఇక, మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో 64.64 శాతం ఓట్లు పోలవ్వగా.. వీటిలో పురుషుల కంటే (65.55 శాతం) మహిళలే (65.78 శాతం) స్వల్పంగా ఎక్కువగా ఉన్నారు. 2019 (11,692) ఎన్నికల కంటే 767 నామినేషన్లు (2024లో మొత్తం 12,459) అధికంగా వచ్చాయి. దీంతో పాటు 2019తో పోల్చితే 360 మంది అధికంగా పోటీ చేశారు. అంతేకాదు, ఈసారి మహిళా అభ్యర్థులు కూడా పెరిగారు. 2019లో 726 మంది పోటీచేయగా.. ఈ ఎన్నికల్లో 800 మంది బరిలో నిలిచారు.
అత్యధిక మెజార్టీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్ధి శంకర్లాల్ వాణి ( 11.75 లక్షల)ది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత భారీ విజయం ఎవరికీ దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆయనకు ఈ మెజారిటీ సాధ్యమైంది. రెండో స్థానంలో అస్సాం కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ (10.12 లక్షలు), తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ (8.21 లక్షలు), సీఆర్ పాటిల్ (7.73 లక్షలు) అమిత్ షా (7.44 లక్షలు) అభిషేక్ బెనర్జీ (7.10 లక్షలు), హేమాంగ్ జోషి (5.80 లక్షలు), బ్రజ్ మోహన్ అగర్వాల్ (5.79 లక్షలు), కుందూరు రఘువీర్ (5.59 లక్షలు), మహేశ్ శర్మ (5.59లక్షలు) నిలిచారు.
ఇక, 2019 కంటే 2024లో థర్డ్ జండర్ ఓటర్లు 46.4 శాతం పెరిగినట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి. దివ్యాంగ ఓటర్లు 90,28,696 (2019లో 61,67,482) ఉన్నట్టు తెలిపింది. అయితే, 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే.. ఈసారి కేవలం 40 చోట్ల మాత్రమే జరిగిందని పేర్కొంది. మొత్తం 3,921 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తే వారిలో ఏడుగురు మాత్రమే గెలుపొందగా.. మిగతా 3,905 మంది డిపాజిట్లు కోల్పోయారు. అత్యధికంగా అసోంలోని ధుబ్రిలో 92.3 శాతం.. అత్యల్పంగా జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో 38.7 శాతం పోలింగ్ నమోదయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa