భారత్-చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి అని అనుకున్న ప్రతీసారి మళ్లీ ఏదో ఒక అంశం.. రెండు దేశాల మధ్య అగ్గిని రాజేస్తోంది. 2020లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య జరిగిన తలెత్తిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇదే విషయంపై అనేక దఫాలుగా సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇటీవల ఆ చర్చలు పూర్తి కాగా.. సరిహద్దుల్లో మోహరించిన సైన్యాలు, ఆయుధాలను వెనక్కి మళ్లించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే రెండు వైపులా బలగాలు వెనక్కి వెళ్లినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. దీంతో నాలుగున్నర ఏళ్ల నాటి సమస్య తీరిపోయి.. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గిందని భావించే లోపు భారత్కు మరోసారి చైనా తలనొప్పిగా మారింది.
లడఖ్లోని సరిహద్దు ప్రాంతంలో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేసినట్లు భారత్ గుర్తించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి చట్ట విరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల.. ఆ ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇక ఇదే లడఖ్లో ఆక్రమణల అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన ఇప్పటికే వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.
చైనాలోని హోటాన్ ప్రాంతం.. లడఖ్కు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హోటన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన చూసినట్లు రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ రెండు కౌంటీల్లోని కొంత భాగం లడఖ్ పరిధిలోకి వస్తుందని.. ఈ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు వెల్లడించారు. అయితే దీన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించదని తేల్చి చెప్పారు. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది లడఖ్ ప్రాంతంలో భారత్కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇలా చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించడం చట్టబద్ధత లభించదని రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa