గత కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్లో మావోయుస్ట్లు, భద్రతా సిబ్బందికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. అటు వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా మృతి చెందుతుడంగా.. ఇటు ఎదురుకాల్పులు, మందుపాతరలు పేలి భద్రతా సిబ్బంది కూడా చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇక మావోయిస్ట్ కదలికలపై నిఘా మరింత తీవ్రం చేసిన భద్రతా బలగాలు.. ఎప్పటికప్పుడు వారి చర్యలను కనిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వారు పెట్టిన మందుపాతరలను పేలకముందే గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. అయితే తాజాగా ఓ మందుపాతర పేలడంతో భద్రతా బలగాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘోర దుర్ఘటనలో 10 మంది జవాన్లు చనిపోగా.. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా భేద్రే-కుట్రు రహదారిలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు పాతిపెట్టిన ఐఈడీ బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఆ ఐఈడీ బాంబులు పేలిన సమయంలో భద్రతా బలగాల వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. అందులో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో మరో ఐదుగురు జవాన్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ మందుపాతర పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల ఉన్నతాధికారులు హుటాహుటిన.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గాయపడ్డ సైనికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక ఆదివారం ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు్ల్లోని దక్షిణ అబూజ్మడ్ అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. యాంటీ నక్సల్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈనెల 3వ తేదీన కొండెగావ్, నారాయణపుర్, దంతెవాడ, జగదల్పుర్కు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. అయితే శనివారం సాయంత్రం నుంచి మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎదురు కాల్పులు జరుగుతుండగా.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం అయిన కాల్పులు నాన్స్టాప్గా 2 గంటలు జరిగాయి. ఇక మృతి చెందిన నలుగురు మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇక దంతెవాడకు చెందిన డీఆర్జీ హెడ్కానిస్టేబుల్ సన్ను కరమ్(35) తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే చనిపోగా.. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa