దేశరాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే అక్కడి ప్రధాన పార్టీలు అన్ని పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ఇస్తున్నాయి. ఉచితాలతో పాటు అనేక వరాలు ఇస్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించగా.. బీజేపీ కూడా అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా మేనిఫెస్టోకు ముందే పలు హామీల గురించి తెలిపిన బీజేపీ.. తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే అందులో ఏయే వరాలు ఇచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను బీజేపీ తాజాగా ప్రకటించింది. సంకల్ప పత్రా పార్ట్ - 1 పేరుతో తీసుకువచ్చిన ఈ మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రోజు ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీ స్త్రీలకు 21 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఆరు పౌష్టికాహార కిట్లను అందజేస్తామని వివరించారు. ఇప్పటికే గర్భిణీలకు మొదటి సంతానంలో 5 వేలు, రెండో సంతానంలో 6 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుండగా... 21 వేలు అదనంగా ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఇవి మాత్రమే కాకుండా పేద ప్రజలకు 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ అందజేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వివరించింది. అలాగే హోలితో పాటు దీపావళి పండుగల రోజు ఉచితంగా ఓ సిలిండర్ ఇస్తామని చెప్పుకొచ్చింది. అలాగే జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తామని తెలిపింది. సంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.
మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నట్లు ఇదివరకే ప్రకటించింది. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంతో పాటు అదనంగా మరో 5 లక్షల ఆరోగ్య కవరేజీని కూడా కల్పించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇలా అద్భుతమైన పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. చూడాలి మరి ఈ పార్టీ.. జనవరి 5వ తేదీన జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa