గిరిజన ప్రాంతంలో పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఆదివాసీ విద్యార్థులు, వృత్తిదారులు, ఇతర వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా వుంటుందని అరకులోయ ఎంపీ గుమ్మ తనూజారాణి అన్నారు. స్థానిక సబ్పోస్టాఫీసు ఆవరణలో బుధవారం సాయంత్రం పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు పాస్పోర్టు కోసం విశాఖపట్నం వెళుతున్నామని, పాస్పోర్టు చేతికి అందడానికి నెలన్నరోజులు పడుతున్నదని అన్నారు. ఇప్పుడు అరులోయలో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయడంతో విశాఖ వెళ్లాల్సిన అవసరం వుండదని, ఇది ఎంతో సంతోషకరమని అన్నారు. గిరిజన విద్యార్థులు కూడా ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారని, ఇటువంటి వారికి ఇక్కడి పాస్పోర్టు సేవా కేంద్రం చాలా మేలు చేస్తుందని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా రోజూ 40 స్లాట్స్ బుక్ చేసుకునే సదుపాయం వుందన్నారు. అరకులోయ ఎమ్మెల్యే మత్సలింగం మాట్లాడుతూ, అరకులోయలో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. చీఫ్ పాస్పోర్టు ఆఫీసర్ డాక్టర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక పోస్టల్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఇది 443వ పోస్టల్ పాస్పోర్టు సేవా కేంద్రమని ఆయన వెల్లడించారు. విశాఖ రిజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ కె.వెన్నం ఉపేందర్ మాట్లాడుతూ, ఏజెన్సీ వాసులు పాస్పోర్టు పొందేందుకు విశాఖపట్నం వెళ్లాల్సిన పనిలేదని, ఈ కేంద్రం సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న తరువాత పోలీసు వెరిఫికకేషన్ పూర్తయిన వెంటనే వారం నుంచి పది రోజుల్లో పాస్పోర్టు పోస్టులో ఇంటికి చేరే విఽధంగా సేవలందిస్తామన్నారు.విశాఖపట్నం పాస్పోర్టు ఆఫీసర్ కె.ఎన్.భాస్కరరావు మాట్లాడుతూ, పాస్పోర్టును పొందాలనుకునే వారు నేరుగా సేవాకేంద్రానికి వెళ్లి స్లాట్బుక్చేసుకొని అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలని, ఈ విషయంలో ఏజెంటు, దళారులను ఆశ్రయించవద్దని చెప్పారు. పాస్పోర్టు పొందడంలో సమస్యలు ఎదురైతే విశాఖలోని మర్రిపాలెంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పాస్పోర్టుసేవా కేంద్రంలో సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా పలువురికి నూతన పాస్పోర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ డీఎస్యూఎన్ రాజు, పాడేరు సబ్కలెక్టర్, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, సీఐ హిమగిరి, అరకు సబ్పోస్టాఫీసు ఇన్స్పెక్టర్ కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa