ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు.. సారీ చెప్పినా కోర్టులో ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 07:56 PM

గంగలో మునిగినంత మాత్రానా పేదరికం తొలగిపోతుందా, తినేందుకు భోజనం దొరుకుతుందా అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  వ్యాఖ్యానించారు. ఈయన చేసిన కామెంట్లపై ఇప్పటికే బీజేపీ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టుకు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హిందువులపై మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదులో వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రోజు కుంభమేళాకు వెళ్లారు. అక్కడే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల పేదరికం పోతుందా అని ప్రశ్నించారు. కనీసం ఎవరికైనా పట్టెడు మెతుకులు దొరుకుతాయా అంటూ అడిగారు. అంతటితో ఆగకుండా బీజేపీ నేతలు కెమెరాల ముందు స్నానం చేసేందుకు పోటీ డుతున్నారని ఆరోపించారు. మోవ్‌లో జరిగిన "జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్" ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.


అయితే తాను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించడం లేదని.. కానీ ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించాలని కోరారు. అలాగే పిల్లలు ఆకలితో చనిపోతున్నారని, కొందరైతే బడికి కూడా వెళ్లలేకపోతున్నారని.. కార్మికులకు జీతాలు కూడా సరిగ్గా అందడం లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు వేలాది రూపాయలు ఖర్చు చేసి గంగా నదిలో స్నానం చేసేందుకు పోటీ పడడం తనకు ఏమాత్రం నచ్చలేదని వివరించారు. తమకు కూడా దేవుడిపై నమ్మకం ఉందని.. రోజూ ఇంట్లోనే ప్రార్థన చేస్కుంటే తమకేమీ అభ్యంతరం లేదంటూ వెల్లడించారు. కానీ మతం పేరుతో పేదలను దోపిడీ చేయడం పట్ల తమకు అభ్యంతరం ఉందిని.. దానికి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని సూచించారు.


దీనిపై బీజేపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా బిహార్‌కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా ముజఫర్‌పూర్ కోర్టులో మల్లికార్జున్ ఖర్గేపై ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు హిందువుల మనోభావాలను కావాలనే దెబ్బ తీశారంటూ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం సనాతన ధర్మాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీన్ని గమనించిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 3వ తేదీన విచారించేందుకు నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com