ఆమ్ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. అందులో ధనవంతులకు రుణమాఫీ గురించి అనేక విషయాలు వెల్లడించారు. కోటీశ్వరులు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆరోపించారు. వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ధనవంతులకు మాత్రమే సాయం చేస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల సాధారణ ప్రజలు అధిక పన్ను భారాన్ని మోయలేక పోతున్నారని చెప్పుకొచ్చారు.
అలాగే సామాన్య ప్రజలు తీసుకునే గృహ, వాహనాల వంటి రుణాలను కేంద్రం ఎందుకు మాఫీ చేయడం లేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒకవేళ కోటీశ్వరుల రుణమాఫీని ఆపగల్గితే సామాన్య ప్రజలపై ఆదాయపు పన్ను, జీఎస్టీ ధరల భారాన్ని సగానికి సగం తగ్గించొచ్చని వివరించారు. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని కూడా రెట్టింపు చేయొచ్చని స్పష్టం చేశారు. ఇవి మాత్రమే కాకుండా నిత్యావసర సరుకుల వస్తువులపై జీఎస్టీ తొలగించవచ్చని తెలిపారు. ధనవంతులకు రుణమాఫీ అనేది పెద్ద కుంభకోణం అని దీన్ని ఆపాలంటూ లేఖలో వెల్లడించారు.
"దేశంలోని ధనవంతుల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేసే బదులు.. దేశంలోని రైతులు, మధ్య తరగతి ప్రజల రుణాలను మాఫీ చేయాలి. మధ్య తరగతి ప్రజలపై కూడా పన్ను భారం తగ్గించాలి." అంటూ ఎక్స్ వేదికగా కూడా వివరించారు. మరి దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. మరో వారం రోజుల్లోనే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీనే పోలింగ్ నిర్వహిస్తుండగా.. 8వ తేదీన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తేల్చబోతున్నారు. చూడాలి మరి ఈసారి ఢిల్లీని ఏలబోయేది ఎవరనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa