ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 లక్షల నుంచి 12 లక్షలకు.. 'ఇన్‌కమ్ ట్యాక్స్‌'లో మార్పులు

business |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 11:57 PM

గడిచిన దశాబ్ద కాలంలో భారతీయుల వ్యక్తగత ఆదాయపు పన్ను నిర్మాణంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మధ్య తరగతి ట్యాక్స్ పేయర్లపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ వచ్చారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి చూస్తే ఆదాయపు పన్నుల పరిమితిని స్థిరంగా పెంచుతూ ఉపశమనం కల్పించారు. ప్రధానంగా అధిక మినహాయింపు పరిమితిలు ఇచ్చారు. ట్యాక్స్ శ్లాబుల్లో మార్పు, రిబేట్ పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుని భారీ ఊరట ఇచ్చారు. 2014 బడ్జెట్ నుంచి 2025 బడ్జెట్ నాటికి వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెరిగింది. అది ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


2014లో మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు ట్యాక్స్ పేయర్లు రూ.2 లక్షలపైన ఆదాయం ఉంటే 10 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది. రూ.5 లక్షలపై 20 శాతం, రూ.10 లక్షలు ఆపైన ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ ఉండేది. అలాగే రూ.5 లక్షల వరకు రూ.2 వేలు రిబేట్ కల్పించారు. అయితే, 2025-26 బడ్జెట్ వరకు వస్తే పన్నుల నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2023లో కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. రిబేట్ భారీగా పెంచారు. 5 శాతం నుంచి 30 శాతం మధ్య ట్యాక్స్ రేట్లతో పన్ను శ్లాబుల్లోనూ కీలక మార్పులు చేశారు. ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తూ ఏకంగా రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రిబేట్ రూ.60 వేలకు పెంచింది.


కొత్త పన్ను చట్టంలో ట్యాక్స్ శ్లాబులను 5, 10, 15,20, 25,30గా విభజించారు. రూ.4 లక్షల వరకు జీరో ట్యాక్స్ ఆపైన రిబేట్‌తో కలిపి రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా మధ్య తరగతి ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం కల్పించారు. గడిచిన దశాబ్ద కాలం 2014 నుంచి చూసుకుంటే ట్యాక్స్ ఫ్రీ ఇన్‌కమ్ పరిమితిని భారీగా పెంచారు. 2014లో అది రూ.2 లక్షలుగా ఉండగా.. 2019కి వచ్చే సరికి రూ.5 లక్షలకు పెరిగింది. సెక్షన్ 87ఏ కింద రిబేట్ కల్పించారు. లేటెస్ట్ బడ్జెట్‌లో రూ.12 లక్షలకు పెంచారు. కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.


2014లో ఓ ట్యాక్స్ పేయర్ రూ.6 లక్షలు సంపాదిస్తే అందులో రూ.50 వేలు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు 2025 కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్.


2014లో రూ.12 లక్షల ఆదాయం ఉంటే కట్టాల్సిన పన్ను రూ.1.90 లక్షలు. కానీ ఇప్పుడు రూపాయి కట్టక్కర్లేదు.


2014లో రూ.18 లక్షల ఆదాయం ఉంటే ట్యాక్స్ రూ.3.7 లక్షలు. కానీ 2025లో కేవలం రూ.1.45 లక్షలు. దాదాపు సగానికి తగ్గింది.


2014లో రూ.30 లక్షల ఆదాయం ఉంటే రూ.7.3 లక్షల ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు 2025లో అది రూ.4.8 లక్షలకు తగ్గింది.


తక్కువ రేట్లు, ఎక్కువ శ్లాబులు..


2014లో మూడే శ్లాబులు (10,20,30) ఉండేవి. ఇప్పుడు 2025కి వచ్చే సరికి అవి ఆరు శ్లాబులు (5,10,15,25,30)గా మార్చారు. రూ.8 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి భారీగా పన్ను మినహాయింపులు కల్పించారు. గతంలో వారంతా 30 శాతం ట్యాక్స్ శ్లాబులో ఉండేవారు. మరోవైపు.. పాత పన్ను విధానాన్నీ కొనసాగిస్తున్నారు. తమ ఆదాయాన్ని బట్టి ఏది బెటర్ అనేది నిర్ణయించుకునే వీలు కల్పిస్తున్నారు. కొత్త విధానంలో పన్ను పరిమితి పెంచిన తర్వాత పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారన్న వార్తలను తోసిపుచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com