ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన నిర్ణయంతో హెచ్ఐవీ మృతులు పెరుగుతారు.. ఐరాస ఆందోళన

international |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 11:15 PM

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్, అమెరికాను మళ్లీ ప్రపంచంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్న ట్రంప్.. ఆ దిశగా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ సాయాన్ని అందించడం అమెరికా నిలిపివేస్తుందని పేర్కొనడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ట్రంప్ నిర్ణయంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి.. హెచ్ఐవీ మరణాలు భారీగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. 4 ఏళ్లలో 63 లక్షల హెచ్ఐవీ మరణాలు సంభవించవచ్చని తెలిపింది. కొత్తగా 87 లక్షల మంది ఎయిడ్స్ సోకే ప్రమాదం ఉందని అంచనా వేసింది.


అంతర్జాతీయ సాయం నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్‌ విభాగం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది. ఎయిడ్స్‌ కార్యక్రమానికి అమెరికా సాయం ఆపేస్తే.. 2029 నాటికి హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 6 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. లక్షల మంది ప్రాణాలు పోవడమే కాకుండా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. గత కొన్నేళ్లుగా హెచ్‌ఐవీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్న ఐరాస ఎయిడ్స్ విభాగం.. 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదైనట్లు వెల్లడించింది.


1995లో నమోదైన గరిష్ఠ కేసుల సంఖ్యతో పోలిస్తే 60 శాతం తగ్గినట్లు యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయాన్‌యిమా వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయంతో హెచ్ఐవీ విషయంలో ఇప్పటివరకు పడిన కష్టం మొత్తం నీటిపాలు అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2029 నాటికి కొత్తగా 87 లక్షల మంది హెచ్‌ఐవీ బారిన పడవచ్చని.. 63 లక్షల ఎయిడ్స్‌ మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. 34 లక్షల మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారే ప్రమాదం ఉందని విన్నీ బయాన్‌యిమా పేర్కొన్నారు.


ఇక పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం లక్ష్యంతో యూఎస్‌ఎయిడ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ప్రభుత్వంలోని అతిపెద్ద మానవత, అభివృద్ధి పనుల విభాగంలో 13 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలోని 160కి పైగా దేశాల్లో ప్రతీ సంవత్సరం రూ.3.83 లక్షల కోట్లను అమెరికా ఈ సాయం కింద ఖర్చు చేస్తోంది. అయితే ఈ ఫెడరల్‌ గ్రాంట్లు, రుణాలను జనవరి 28వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అందిస్తున్న గ్రాంట్లను సమీక్షిస్తున్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ వెల్లడించింది.


ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాలకు, పలు స్వచ్ఛంద సంస్థలకు అమెరికా చేసే ఆర్థిక సాయం ఆగిపోనుంది. దీంతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ, విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కార్యక్రమాలపైనా ప్రభావం పడుతుంది. అయితే సామాజిక భద్రత లేదా మెడికేర్‌ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థికసాయంపై ప్రభావం చూపదని వైట్‌హౌస్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ అనేక దేశాలు ఆందోళనలో పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com