కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని కోలియాండి కురువంగడ్లో గల మనక్కులంగారా ఆలయంలో గురువారం రోజు జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాల కోసం మూడు ఏనుగులను కూడా తీసుకు వచ్చారు ఆలయ నిర్వాహకులు. వీటిని ఆలయంలోని ఓ చోట ఉంచగా.. పూజల నిమిత్తం వందలాది మంది ప్రజలు గుడికి చేరుకున్నారు. ఓవైపు పూజలు జరుగుతుండగానే.. మరోవైపు ఏనుగులు బీభత్సం సృష్టించడం ప్రారంభించాయి. ఒక్కసారిగా పీతాంబరన్, గోకుల్ అనే ఏనుగులు గట్టి గట్టిగా అరుస్తూ.. జనాలపైకి దూసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి.
విషయం గుర్తించిన కొందరు జనాలు వాటిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ అవి మాత్రం మరింతగా రెచ్చిపోయి.. అక్కడున్న వారందరిపై దాడి చేశాయి. ఒక్కొక్కరినీ ఎత్తి పడేశాయి. ఇదంతా చూసిన భక్తులు పరుగులు పెట్టారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
ప్రస్తుతం 21 మంది కోయిలాండి తాలూకా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 14 మంది కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఉన్నారు. అయితే వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు మృతి చెందిన ముగ్గురిలో 68 ఏళ్ల లీల, 66 సంవత్సరాల రాజన్, 65 ఏళ్ల అమ్ముకుట్టి ఉన్నట్లు తెలిపారు. అయితే వీరి మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఏనుగులు జనాలను ఎత్తిపడేయడం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. నెల రోజుల క్రితమే కేరళలోని మలప్పురం జిల్లా పుతియంగడి ఉత్సవంలోనూ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆ ఘటనలో 17 మందికి పైగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa