ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు కోట్లమంది భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే 50 కోట్ల మందికిపైగా భక్తులు గంగా యమునా సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక ఈనెల 26వ తేదీన మహా శివరాత్రి రోజున ముగియనుండటంతో.. భారీగా భక్తులు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్దకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీతో ప్రయాగ్రాజ్ నిండిపోతోంది. ఇక దేశం నలువైపుల నుంచి ప్రయాగ్రాజ్కు వాహనాలు పోటెత్తడంతో ఆ మార్గాల్లో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. రోజుల తరబడి రోడ్లపైనే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
నేటి నుంచి స్పెషల్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నట్లు నార్తర్న్ రైల్వేస్ వెల్లడించింది. ట్రాఫిక్, ఇతర సమస్యలతో మహా కుంభమేళాకు వెళ్లేవారికి ఇబ్బంది కలగకుండా భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక వందే భారత్ రైలు ఈనెల 15, 16, 17వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ రైలు ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ మీదుగా వారణాసి వరకు ప్రయాణించనున్నట్లు నార్తర్న్ రైల్వేసే స్పష్టం చేసింది.
02252 నంబర్ వందే భారత్ ప్రత్యేక రైలు.. న్యూఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం.. 12 గంటలకు ప్రయాగ్రాజ్కు చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి బయల్దేరి చివరికి 2:20 గంటలకు వారణాసి రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని నార్తర్న్ రైల్వేస్ తెలిపింది. తిరుగు ప్రయాణంలో 02251 నంబర్ గల స్పెషల్ వందే భారత్ రైలు.. వారణాసిలో మధ్యాహ్నం 3:15 గంటలకు బయల్దేరుతుందని పేర్కొంది. ఈ రైలు ప్రయాగ్రాజ్కు సాయంత్రం 5:20 గంటలకి చేరుకోనుంది. ఇక రాత్రి 11:50 గంటలకు ఆ రైలు తిరిగి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ వెల్లడించారు. 3 రోజుల పాటు ఈ రైలు ఇదే షెడ్యూల్ ఉంటుందని వివరించారు. వీకెండ్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో అన్ని రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో ప్రయాగ్రాజ్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభమేళా.. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పోటెత్తుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa