ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి ఉచిత సిలిండర్ మార్చి 31వ తేదీలోగా నమోదు చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 11:21 AM

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు సర్కార్. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది.బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్‌కు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు ఖాతాలోకి జమయ్యాయో లేదో లబ్ధిదారులు ఓసారి చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా, ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోని వారు మార్చి 31వ తేదీలోగా బుక్ చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ, దీపావళి కానుకగా గతేడాది అక్టోబర్ 31న దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు 98% మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇంకా డబ్బులు రాకపోయిన వారు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చు. అలాగే గ్రామ/వార్డు సచివాలయాలు లేదా తహసీల్దార్ కార్యాలయాల్లోని పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలనీ అధికారులు సూచించారు.దీపం పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయినప్పటికీ, మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కాలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అయితే, ఆ తర్వాత ఈ సమస్యను పరిష్కరించి, 98% మంది లబ్ధిదారులకు డబ్బులు జమ చేశారు. ఇక మిగిలిన 2% లబ్ధిదారులకు వివిధ కారణాల వల్ల డబ్బులు అందలేదు.దీపం పథకం కింద లబ్ధిదారులు రూ. 840 చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాలి. సిలిండర్ డెలివరీ అయిన వెంటనే ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో రూ. 20 కేంద్ర ప్రభుత్వం, మిగిలిన రూ. 820 ఏపీ ప్రభుత్వం భరిస్తోంది.ఇప్పటివరకు బుక్ చేయని వారికి ఇంకా కొన్ని రోజులు అవకాశం మిగిలే ఉంది. అర్హులైన వారు మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం అందించే ఫ్రీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకోని లబ్ధిదారులు మార్చి 31వ తేదీలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా 1.54 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ, 1.08 కోట్ల కనెక్షన్లు మాత్రమే దీపం 2.0 పథకానికి అర్హులు. ఆధార్ వివరాలు సమర్పించని కారణంగా కొన్ని రేషన్ కార్డు హోల్డర్లు పథకానికి అర్హత పొందలేకపోయారు. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానం పూర్తి చేసిన వారికే ఈ పథకం వర్తిస్తుంది.ఆధార్ & రేషన్ కార్డు తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరుతోనైనా ఉండొచ్చు, కానీ రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండాలి. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హత ఉంటుంది. ఒకే రేషన్ కార్డులో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉంటే, కేవలం ఒక్కదానికే రాయితీ వర్తిస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లకూ రాయితీ అందుబాటులో ఉంటుంది.ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు EKYC పూర్తి చేయాలి. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా డీలర్ దగ్గర పూర్తిచేయవచ్చు. సిలిండర్ తీసుకున్న 48 గంటల లోపే గ్యాస్ సంస్థలు రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాయి.మొత్తానికి, దీపం 2.0 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు బుక్ చేయని వారు మార్చి 31 లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్ 1967 ద్వారా లేదా గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com