ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 11:55 PM

ఎనిమిదేళ్ల తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గత టోర్నీ రన్నరప్‌ భారత్.. విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. సాధారణంగా ఏ క్రికెటర్ అయినా.. తమ దేశం గెలుస్తుందని చెబుతుంటారు. కానీ, మైకెల్ క్లార్క్ మాత్రం భారత్‌కే ఓటు వేశాడు. ఇందుకు గల కారణాలను సైతం చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌ నుంచి పరుగుల వరద పారడం ఖాయమని వ్యాఖ్యానించాడు.


‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్‌ గెలవబోతుంది. ఇదే నా మాట. భారత జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా లోటును మరొకరు పూడ్చలేరు. అతడిని కచ్చితంగా మిస్ అవుతారు. అతడో మ్యాచ్ విన్నర్‌. కానీ బుమ్రా లేకున్నా భారత జట్టు బలంగానే ఉంది. బుమ్రా జట్టులో లేకపోయినా.. నా దృష్టిలో టీమిండియానే టైటిల్ ఫేవరెట్‌. శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి వచ్చేశాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, కుల్‌దీప్ యాదవ్‌లు మ్యాచ్‌ విన్నర్లు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు అంత ఈజీ కాదు’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు.


ఇక మిగతా జట్లపై కూడా క్లార్క్ మాట్లాడాడు. ఇంగ్లాండ్ బలంగానే కనిపిస్తున్నా.. జట్టుగా మాత్రం రాణించి టైటిల్ సాధించే అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పాడు. ట్రావిస్ హెడ్‌ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తాడని.. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు పడగొడతాడని క్లార్క్ వ్యాఖ్యానించాడు.


ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఆతిథ్య దేశం పాకిస్థాన్ అయినప్పటికీ, భారత్‌ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న భారత జట్టు ముమ్మర సాధన చేస్తోంది. ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత ఆటగాళ్లు చమటోడుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa