ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.4.3 లక్షలు వెనక్కి

international |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 08:30 PM

అమెరికాలో రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. నిత్యం అనేక ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌పై సంతకాలు చేస్తూ.. సంచలన నిర్ణయాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ-డోజ్‌.. తన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి వృథాగా పోయే ఖర్చును అడ్డుకోవడంలో డోజ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ట్రంప్ 2.0 పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 55 బిలియన్ డాలర్ల ఖర్చులను అదుపు చేసింది. అయితే అలాంటి డోజ్ ఇప్పుడు వినూత్నమైన పద్దతికి శ్రీకారం చుట్టనుంది.


అమెరికాలో వచ్చే పన్ను చెల్లించేవారికి 5 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.4.3 లక్షలను నజరానాగా అందించాలని ప్రతిపాదించింది. పన్ను చెల్లించే అమెరికన్లకు వచ్చే ఏడాది ఈ చెక్కులు అందించేందుకు డోజ్‌ సన్నాహాలు చేస్తోంది. దీనిపై స్పందించిన డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్.. ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు తీసుకెళ్లి.. ఆయన ఆమోదం కల్పిస్తే అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి చూద్దామని.. ఆయనే అన్నింటికీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అని.. అందుకే ఇదంతా ఆయనపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు.


వచ్చే ఏడాది జులై 4వ తేదీన అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనేనాటికి ఫెడరల్ బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డోజ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో అనవసర ఖర్చులకు భారీగా కోతలు విధిస్తున్న డోజ్‌.. ఖర్చులను తగ్గించి మిగిలినదాంట్లో కొంత మొత్తాన్ని తీసి.. పన్ను చెల్లింపుదారులకు డోజ్‌ డెవిడెండ్‌ పేరిట 2026 జులై తర్వాత ఈ 5 వేల డాలర్ల చొప్పున చెక్కులను అందించాలని అజోరియా సంస్థ సీఈవో జేమ్స్‌ ఫిష్‌బ్యాక్‌ డోజ్‌కు సూచించారు. ఈ జేమ్స్ ఫిష్‌బ్యాక్.. డోజ్‌లో సభ్యుడిగా కాకుండా బయటి నుంచి డోజ్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.


అమెరికా ప్రభుత్వం ఏటా 6.5 ట్రిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.564 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఇందులో 2 ట్రిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.173 లక్షల కోట్లు కోత విధించే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. దీని ప్రకారం అందులో 20 శాతం అంటే 7.9 కోట్ల పన్ను చెల్లింపుదారులకు పంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డోజ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం సోమవారం నాటికి అమెరికాలో 55 బిలియన్‌ డాలర్లు అంటే రూ. 4.77 లక్షల కోట్లను మిగిల్చింది. మోసాలకు అడ్డుకోవడం.. కాంట్రాక్టులు, లీజ్‌లు రద్దు చేయడం.. ఆస్తుల అమ్మకాలు.. నిధుల రద్దు వంటి వాటితో భారీగా ఖర్చులను అదుపు చేసింది.


అయితే డోజ్ విషయంలో ఎలాన్ మస్క్‌ టీమ్‌ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌మెంట్లలోని సమాచారాన్ని ఇష్టం వచ్చినట్లు ఇప్పటికే పలువురు కోర్టులను కూడా ఆశ్రయించారు. వైట్‌హౌస్‌లోని సీనియర్‌ సలహాదారుల మాదిరిగా స్వతహాగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారం ఎలాన్ మస్క్‌కు లేదని వైట్‌హౌస్‌ వ్యవహారాల డైరెక్టర్‌ జోషువా ఫిషర్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa