గజపతినగరం పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. గంటన్నర వ్యవధిలో 8 షాపులను లూటీ చేశారు. రూ.1.57లక్షల నగదుతో పాటు ఫోన్లు, వాచీలు, ఇతర విలువైన సామగ్రిని దోచుకు న్నారు. దీంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న డీమార్ట్, సూపర్ మార్కెట్, వెంకీ మొబైల్షాపు, తిరుమల ట్రేడర్స్, మెంటాడ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఆర్కే మార్ట్, వాకర్స్ చెప్పుల షాపు, వెంకటేశ్వర కిరణా జనరల్ షాపు, ఉమెన్స్ కిడ్ జోన్ షాపుల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఆర్కే మార్ట్, తిరుమల ట్రేడర్స్లో సీసీ కెమెరాలను తీసి కిందపడేశారు. సూపర్ మార్కెట్లోని సీసీ కెమెరాలను తొలగించి కాలువలో పడేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.30గంటల మధ్య ఈ చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.ఆటోలు వస్తున్న సమయంలో వారికి కనిపించకుండా దొంగలు ఓ షాపు మెట్లపై పడుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. డీమార్ట్లో రూ.10వేలు, తిరుమల ట్రేడర్స్లో రూ.5వేలు, వెంకీ మొబైల్స్ షాపులో రూ.92వేల నగదు, 25సెల్ఫోన్లు, 6 వాచీలు, సూపర్ మార్కెట్లో రూ.6 వేలు, ఆర్కే మార్ట్లో రూ.30వేలు, వాకర్స్ చెప్పులషాపులో రూ.వెయ్యి, వెంకటేశ్వర కిరాణా దుకాణంలో రూ.6వేలు, ఉమెన్కిడ్స్ జోన్లో రూ.10వేలు నగదు పోయినట్లు బాధితు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కె.లక్ష్మణరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపుల షట్టర్లకు వేసిన తాళాలను పగులగొట్టి దొంగలు చోరీ చేసినట్లు గుర్తించారు. విజయనగరం నుంచి క్లూస్టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి మాట్లాడుతూ.. దొంగలు బిక్షగాళ్లుగా నటించి, షాపుల షట్టర్లను పూర్తిగా తెరవకుండా ఒక మనిషి వెళ్లినంతగా షట్టర్లు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు చెప్పారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వారిని గుర్తిస్తామన్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు బీట్ విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. కాగా, రాత్రి సమయాల్లో బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లు గప్పి దొంగలు చోరీకి పాల్పడడం గమనార్హం. పోలీసుల వైఫల్యం కారణంగానే దొంగతనం జరిగినట్లు పట్టణవాసులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa