కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. దానికి తోడు దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా టారిఫ్ పెంపు ప్రకటనలతో వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో వృద్ధి రేటు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత్లో ఉద్యోగుల వేతనాల పెంపు అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఏడాది ఇండియాలో వేతనాలు సగటున 9.2 శాతం మేర పెరగనున్నాయని అంతర్జాతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏఆన్ పీఎల్సీ ఓ నివేదిక విడుదల చేసింది.
2023లో వేతనాల సగటు పెంపు 9.3 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది. దేశంలోని మొత్తం 45 రంగాలకు చెందిన 1400లకుపైగా కంపెనీల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపింది. దీని ప్రకారం 2022 నుంచి వేతనాల పెంపులో తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. ఆ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ప్రభావంతో వేతనాల సగటు పెంపు 10.6 శాతంగా ఉంది. 2024లో మొత్తం సిబ్బంది వలసల రేటు 17.7 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 18.7 శాతంగా ఉండగా 2022లో అది 21.4 శాతంగా ఉంది. అంటే గతేడాది భారీగానే వలసలు తగ్గాయని తెలుస్తోంది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, అమెరికా వాణిజ్య విధానాలు, పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, జనరేటివ్ ఏఐలో వేగవంతమైన మార్పులు వంటి అనేక కారణాలు వేతనాల పెంపు తగ్గేందుకు కారణమవుతున్నట్లు నివేదిక అంచనా వేసింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు స్థిరంగా ఉన్నాయని, వేతన పెంపు వృద్ధిలో తగ్గుదల ఎక్కువగా ఏమీ లేదని పేర్కొంది. ఇంజినీరింగ్ డిజైనింగ్, వాహన తయారీ బడ్జెటింగ్ విభాగంల్లో అయితే 10.2 శాతం చొప్పున వేతన పెంపు ఉండనుందని పేర్కొంది. బ్యాంకింగేతర సంస్థల్లో 10 శాతం మేర వేతనాలు పెరగవచ్చని అంచనా వేసింది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వినూత్నతను అందిపుచ్చుకుంటే కంపెనీలు స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు అవకాశాలు ఉన్నాయని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa