ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ పాఠ్యాంశాల్లో మార్పులు.. ఇందిరాగాంధీ ఫోటోలు తొలగింపు

international |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 07:58 PM

బంగ్లాదేశ్‌లో అధికారం చేపట్టిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం.. సమూల మార్పులకు తెరలేపిన విషయం తెలిసిందే. ఇక షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత.. క్రమంగా భారత్‌కు శత్రుదేశంగా మారుతోంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడంలో కీలక పాత్ర పోషించిన భారత్‌ను కాదని శత్రుదేశమైన పాకిస్తాన్‌తో ఇప్పుడు స్నేహం చేస్తోంది. ఇప్పటివరకు మిత్రదేశంగా ఉన్న భారత్‌ను దూరం పెడుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల ఆనవాళ్లను తుడిచిపెట్టేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోలను తొలగించింది. అంతేకాకుండా మాజీ ప్రధాని షేక్ హసీనా పేరును కూడా తీసేసింది. ఇక బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఫోటోలను కూడా బంగ్లాదేశ్ పాఠ్యాంశాల నుంచి చెరిపేశారు.


2025-2026 అకడమిక్ సంవత్సరానికి సంబంధించి.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. విద్యార్థుల స్కూలు పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేసింది. అన్ని తరగతుల టెక్స్ట్‌బుక్స్ నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అనే పేరును బంగ్లాదేశ్‌ నేషనల్‌ కరికులమ్‌ అండ్‌ టెక్స్ట్‌బుక్‌ బోర్డు పూర్తిగా తొలగించేసింది. దీంతో పాటు బంగ్లాదేశ్ జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫోటోలను కూడా తీసివేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ కొత్త పుస్తకాలు ముద్రించడం గమనార్హం.


బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత 1972 ఫిబ్రవరి 6వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో అప్పుడు భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ.. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్‌ రెహమాన్‌తో కలిసి పాల్గొని ప్రసంగం చేశారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చి నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇందిరాగాంధీ పర్యటించారు. అయితే ఈ సంఘటనలకు సంబంధించిన ఫొటోలు ఇప్పటివరకు బంగ్లాదేశ్ విద్యార్థుల హిస్టరీ టెక్స్ట్‌బుక్స్‌లో ఉండేవి. కానీ తాజాగా సవరించి కొత్తగా విడుదల చేసిన టెక్ట్స్‌బుక్‌లలో వాటిని తీసేశారు. అంతేకాకుండా 1971 యుద్ధంలో భారత ఆర్మీ, ముక్తివాహిని పాల్గొన్న అంశాలు.. అదే ఏడాది డిసెంబరు 16వ తేదీన పాక్‌ సైన్యం లొంగిపోయిన విషయాలను కొత్త సిలబస్‌లో అలాగే ఉంచారు.


పాకిస్తాన్ నుంచి విడిపోయి.. బంగ్లాదేశ్‌ కొత్త దేశంగా ఏర్పడడానికి, బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం రావడానికి కారణ భారత్‌ అంటూ గతంలో పుస్తకాల్లో ముద్రించగా.. తాజాగా వాటిని మార్చారు. ఇక అన్ని టెక్స్ట్‌బుక్‌లకు వెనకాల పేజీలో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా చెప్పిన సందేశం ఉండగా.. తాజాగా దాన్ని తీసేశారు. ఇక ముజిబుర్ రెహమాన్‌ నాయకత్వాన్ని పొగుడుతూ రాసిన అంశాలను కూడా తగ్గించి.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఇతర నేతల ప్రస్తావనను చేర్చారు.


ఈ సవరణల కారణంగా ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన 441 పుస్తకాల్లో మార్పులు చేయాల్సి రానుంది. 2025 అకడమిక్ ఇయర్‌కు కొత్త పుస్తకాలు 40 కోట్లకు పైగా ముద్రించనున్నట్లు బంగ్లాదేశ్ విద్యాశాఖ తేల్చింది. 2012 కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఈ సవరణలు చేశామన్న ఎన్‌సీటీబీ ఛైర్‌పర్సన్‌ రీజుల్‌ హసన్‌.. భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఉంటాయని తెలిపారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ దేశంలోని స్టూడెంట్స్ రోడ్డెక్కడంతో చెలరేగిన అల్లర్లు చివరికి గతేడాది ఆగస్టు 5వ తేదీన మాజీ ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa