ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాలో కీలక మార్పు.. రిషభ్ పంత్‌కు మళ్లీ నిరాశే!

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 08:02 PM

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్.. తాము తొలుత బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దుబాయ్ వేదిక‌గా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్, న్యూజిలాండ్ జట్లు తుది జట్టులో ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి.


న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు యువ పేస‌ర్ హర్షిత్‌ రాణాకు భారత మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. అత‌డి స్ధానంలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తుది జ‌ట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. రిషభ్ పంత్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక న్యూజిలాండ్ కూడా.. ఆ జట్టు డెవాన్ కాన్వేను తప్పించింది. అతడి ప్లేసులో డేరిల్ మిచెల్‌ను జట్టులోకి తీసుకుంది. కాగా ఈ మ్యాచ్ భారత స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లికి 300వ వ‌న్డే మ్యాచ్ కావ‌డం గమనార్హం.


ఇక ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌లు సెమీస్ చేరాయి. ఇవాళ్టి మ్యాచులో గెలిచిన జట్టు గ్రూప్‌ ఏలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఓడిన జట్టు గ్రూప్‌-బి టేబుల్ టాపర్ దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.


కాగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 118 వన్డే మ్యాచులు జరిగాయి. అందులో 60 మ్యాచుల్లో భారత్.. 50 మ్యాచుల్లో కివీస్‌ విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఏడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.


తుది జట్లు..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్ చక్రవర్తి


న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్, విలియం ఒరూర్కే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa