ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్టుదిట్టంగా కివీస్ బౌలింగ్.. భారత్ 249/9.. బంతితో తిప్పేస్తారా

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 08:01 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ దశలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు రాణించడంతో మోస్తరు స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌ తుది జట్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. హర్షిత్ రాణా ప్లేసులో వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది. గ్రూప్‌-ఏ నుంచి ఇదివరకే భారత్, న్యూజిలాండ్‌లు సెమీస్ చేరాయి. దీంతో ఈ మ్యాచ్‌ తుది జట్టులో రెండు జట్లూ కూడా మార్పులు చేశాయి.


అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే గిల్ (2) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (15) కూడా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌తో 300వ వన్డే మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. గ్లెన్‌ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్‌ (42) కలిసి 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔట్ అయినా.. హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 45 రన్స్ చేసి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివరి ఓవర్‌లో పాండ్యా ఔట్ అయ్యాడు. దీంతో 249/9తో భారత్‌.. ఇన్నింగ్స్‌ను ముగించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. కైల్ జెమీసన్, విలియమ్ ఓరూర్కే, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa