తిరుమలలో సోమవారం కిడ్నాప్ అయిన నాలుగేళ్ల బాలికను.. మూడున్నర గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. తమ బిడ్డ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంంగా బాలికను, ఆమెను తీసుకెళ్లిన మహిళను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన నరసింహులు దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె దీక్షితతో కలిసి గతేడాదిగా తిరుమలలోని చిరువ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం తమ కుమార్తె ఆడుకుంటున్న సమయంలో వీరు పనుల్లో నిమగ్నమయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో దీక్షిత కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ విజిలెన్స్, పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. గుర్తుతెలియని మహిళ దీక్షితను వెంట తీసుకెళ్లినట్టు గుర్తించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో బాలిక సహా ఏపీ 03 జెడ్ 5587 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుపతికి వెళ్లినట్టు కెమెరాల్లో రికార్డయింది. వినాయకనగర్ సమీపంలో బస్సు దిగినట్టు గుర్తించిన పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించారు. ఎట్టకేలకు రాత్రి 10.30 గంటల సమయంలో తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లోని ఓ ఇంట్లో చిన్నారిని, మహిళను గుర్తించారు. చిన్నారిని తీసుకెళ్లిన మహిళ తిరుమలలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు నాగ వెంకటరమణగా తేలింది. చిన్నారి ఒంటరిగా ఉందని, తనతో పాటు వస్తున్న క్రమంలోనే తీసుకొచ్చానే తప్ప మరో ఉద్దేశ్యం లేదని ఆమె తెలిపింది. అయినప్పటికీ పోలీసులు తమ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలికను తిరుపతి నుంచి రాత్రి తిరుమలకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa