ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి ఊరేగింపులో గాల్లోకి డబ్బులు.. అందుకునేందుకు వెళ్లి బాలుడి మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 07:37 PM

హర్యానా సోనిపల్ జిల్లాలోని రోహతక్ పట్టణం నుంచి సమీపంలోని తాజ్‌పూర్ గ్రామం వరకు గురువారం రోజు ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. ముఖ్యంగా ఈ ఊరేగింపు తాజ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌజ్ వరకు రాగానే పెళ్లికి వచ్చిన బంధువులు గాల్లోకి కరెన్సీ నోట్లు విసిరారు. అది గుర్తించిన స్థానిక పేద ప్రజలు వాటిని ఏరుకునేందుకు పోటీ పడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ మరి ముందుకెళ్తూ డబ్బులు పట్టుకున్నారు.


అయితే అందరిలాగే 8వ తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల బాలుడు కూడా డబ్బుల కోసం ఎగబడ్డాడు. కింద పడినవి తనకు దొరకడం లేదని.. పైకి చూడగా.. ఫామ్‌హౌస్ పైన డబ్బులు పడడం గమనించాడు. ఈక్రమంలోనే వాటిని తెచ్చుకోవాలని పైకి వెళ్లాడు. డబ్బులు ఎవరైనా తీసుకుంటారేమన్న ఆత్రంతో పరుగులు పెట్టగా.. ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకాడు. దీంతో విద్యుధాఘాతానికి గురై అక్కడికక్కడే మంటల్లో కాలిపోయాడు.


విషయం గుర్తించిన స్థానికులు బాలుడి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ తర్వాత కాసేపటికే పోలీసులు రంగప్రవేశం చేసి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఆపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa