సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపారు. దీంతో బీజేపీ, హిందూ ధార్మిక సంఘాలు.. ఉదయనిధి స్టాలిన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరి నుంచి సామాన్యుల వరకు అనేకమంది ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఈ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్కు భారీ ఊరట కల్పించింది.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉదయనిధి స్టాలిన్పై ఇప్పటికే దేశావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. ఇదే విషయంపై తాజాగా బిహార్లో మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసును సవాల్ చేస్తూ.. ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో కోర్టు అనుమతి లేకుండా ఉదయనిధి స్టాలిన్పై కొత్త కేసులు ఏవీ నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
2023లో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం అనేది డెంగీ, మలేరియా లాంటిదని.. దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే వాటన్నింటిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. మాత్రం తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కావని.. వాటికి తాను కట్టుబడే ఉన్నానని తేల్చి చెప్పారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa