ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్‌తో దోస్తీకి సిద్ధమైన డ్రాగన్

international |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 07:53 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల తీరు మారుతోంది. అప్పటివరకు అమెరికాతో ఉన్న సంబంధాల్లో తేడా రావడంతో ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా భారత్‌ను కవ్వింపులకు గురి చేస్తున్న డ్రాగన్.. ఒక్కసారిగా స్నేహ హస్తం అందిస్తోంది. భారత్-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి.. తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాగ్‌యీ అభిప్రాయం వ్యక్తం చేయడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇందులో భారత్‌పై ప్రేమ కంటే.. అమెరికాతో పెరుగుతున్న వైరమే కారణం అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అన్ని రంగాల్లో ముందున్న అమెరికాను ఢీకొట్టుతున్న చైనా.. ఇప్పుడు భారత్‌తో కూడా పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆలోచించి.. భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు తహతహలాడుతోంది.


ఈ క్రమంలోనే న్యూఢిల్లీ-బీజింగ్‌ పరస్పరం విరోధం పెంచుకోవడం కంటే భాగస్వాముల లాగా కలిసి పనిచేయడం మంచిదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ తాజాగా పేర్కొన్నారు. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడిన వాంగ్‌యీ ఆసియాలోనే ముఖ్యమైన భారత్, చైనా రెండు దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని తెలిపారు. భారత్‌- చైనా భాగస్వాములుగా ఒకరి విజయానికి మరొకరు సహకరించుకోవాలని.. ఇందుకోసం డ్రాగన్‌-ఎలిఫెంట్‌ డ్యాన్స్‌ ఒక్కటే రెండు దేశాలకు ఉన్న సరైన మార్గమని వాంగ్‌యీ తెలిపారు. భారత్-చైనాలు ఒకరికొకరు విమర్శించుకోవడం కంటే.. ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారమే 2 దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుందని వివరించారు.


ఇక భారత్-చైనా మధ్య మెరుగైన సంబంధాలు ఉండటం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇక ఇరుదేశాల మధ్య వివాదాలను దౌత్యమార్గంలో పరిష్కరించుకుంటామని వాంగ్‌యీ పేర్కొన్నారు. చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదని.. అదే సమయంలో సహకారంతో ఎలాంటి లక్ష్యాలనైనా అందుకోవచ్చని వెల్లడించారు. ఇక దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల భేటీలో కేంద్రమంత్రి జైశంకర్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.


నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ భేటీ తర్వాత శుక్రవారం వాంగ్‌యీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2025 నాటికి చైనా-భారత్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు అవుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌తో గొడవ మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించాలని భావిస్తోంది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని.. పరస్పర సహకారంతో కలిసి పనిచేద్దామని పేర్కొంటోంది. అయితే చైనా చేసిన వ్యాఖ్యలపై ఇంకా భారత్ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. చైనాతో కలిసి భారత్ పనిచేస్తోందని చెప్పారు. చైనా నియంత్రణలో ఉన్న ప్రదేశాలకు తీర్థయాత్రలు ప్రారంభించడం, ప్రత్యక్ష విమానాలు నడుపుతామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa