ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్యారావు ఒంటిపై గాయాలు..: కస్టడీకి తీసుకున్న అధికారులే దాడి చేశారా?

national |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 07:40 PM

బంగారం అక్రమంగా తరలిస్తూ దొరికిన కన్నడ నటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రన్యారావు దర్యాప్తులో వెల్లడైన కొన్ని విషయాలను అధికారులు వెల్లడించారు. నటి శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ గాయాలకు కారణం పోలీసు అధికారులేనని.. వాళ్లే ఆమెను కస్టడీకి తీసుకుని దాడికి పాల్పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమంగా తరలిస్తోందని, ఓ సిండికేట్ ముఠాగా ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. నటిని దర్యాప్తు చేస్తుండగా ఆమె ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు కూడా గుర్తించామన్నారు. ఈక్రమంలోనే గాయాలకు కారణం పోలీసులేనని.. వారే కస్టడీలో ఆమెపై దాడికి పాల్పడ్డారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ తప్పుడు వార్తలు అని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. అలాగే కర్ణాటక మహిళా కమిషన్ సైతం దీనిపై స్పందించింది.


రన్యారావు ఒంటిపై ఉన్న గాయాలు చాలా పాతవని అని చెప్పారు. ఆ గాయాలు ఆమె దుబాయ్‌కి వెళ్లడానికి చాలా రోజుల ముందే జరిగినట్లు కూడా నటి ఒప్పుకుందని డీఆర్ఐ అధికారులు స్పష్టం చేశారు. ఈక్రమంలోనే గాయాల విషయంపై అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నటి రన్యారావు దర్యాప్తునకు పూర్తిగా సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు.


శుక్రవారం నాడు నటి రన్యారావుని కోర్టులో ప్రవేశ పెట్టారు. జడ్జి ముందు రన్యారావు కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల పాటు విచారించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు అనుమతులు ఇస్తూ సంబంధిత కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ఇలా ఉండగా.. దుబాయి నుంచి 14.2 కిలోల బంగారాన్ని దుస్తుల్లో దాచుకుని అక్రమంగా తరలిస్తుండగా భద్రతా అధికారులు నటి రన్యారావును పట్టుకున్నారు. తరచూ దుబాయి వెళ్లడం అందులోనూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టి ఆమెను తనిఖీ చేయగా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.


ముఖ్యంగా ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా.. రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, మరో రూ.2.67 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కన్నడ నటి గత 6 నెలల్లో ఏకంగా 27 సార్లు దుబాయికి వెళ్లి వచ్చింది. దుబాయితో పాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకూ ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. సంఘ విద్రోహ శక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించి ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa