ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదంపై పోరులో సరికొత్తగా అలోచించండీ: పాక్ కు భారత్ సలహా

international |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:03 PM

తమది ఉగ్రవాద దేశం కాదు అని పాకిస్థాన్ ప్రపంచదేశాలకు చాటిచెప్పాంటే ముందు‌గా ఆ దేశంలో వున్న ఉగ్రవాద సంస్థలపై తీసుకునే చర్యలు కొత్తగా ఉండాలని పాకిస్తాన్ కు భారత్ సూచించింది. ఈ విషయంలో పాకిస్థాన్ కొత్తగా అలోచిస్తే తప్ప పాకిస్థాన్ పై వున్న ముద్ర చెరిగిపోదని పేర్కోంది. ఈ విషయమై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ సరిహద్దుల్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే భాగంలోనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై వైమానిక దాడులు చేశామని చెప్పారు.
దేశ రక్షణ కోసం ఇలాంటి దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పిన ఆయన పాకిస్థాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే విధానంలో కొత్తగా అలోచించాలని స్పష్టం చేశారు. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడిని నాన్-మిలటరీ చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్- 21తో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చివేశారని, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలూ మన దగ్గర ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను సంఘటనా స్థలం నుంచి సేకరించామని, ఎఫ్-16 యుద్ధ విమానంలో మాత్రమే వినియోగించగలిగే అమ్రామ్ క్షిపణులను లభించడమే దీనికి సాక్ష్యమని అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించామని రవీష్ కుమార్ వెల్లడించారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన దాడులను అడ్డుకునే క్రమంలో ఓ యుద్ధ విమానాన్ని కోల్పోయామని తెలిపారు. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము కూల్చేశామని పాక్ చెబుతోంది. కానీ, దీనికి ఆధారాలను ఎందుకు చూపలేదని ఆయన ప్రశ్నించారు.
పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్ కు మద్దతుగా నిలిచిందని తెలియజేశారు. ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ ప్రకటించినా పాకిస్థాన్ దీన్ని ఖండించడం దురదృష్ట‌కరమని వ్యాఖ్యానించారు. పాక్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగిస్తున్నాయని, ఈ విషయంలో పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకుని తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు.
ఇప్పటికీ పాకిస్థాన్ లో 22 ఉగ్రవాద శిక్షణా శిభిరాలు నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. వీటిలో మసూద్ అజార్ కు చెందిన జైషూ మహ్మద్ సంస్థకు చెందిన శిభిరాలు 9 వున్నాయిని కూడా తేలిందన్నారు. వీటిపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్థాన్, తమ దేశంలోని ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయ సమాజం నమ్మదగిన చర్యలు తీసుకోవాలని రవీష్ కుమార్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa