ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్, మస్క్‌లకు భారీ షాక్.. ఫెడరల్ జడ్జ్ సంచలన ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 07:56 PM

ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో భాగంగా వేలాది మంది ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వులను అమెరికా ఫెడరల్ జడ్జ్ రద్దుచేశారు. వారిని తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ‘‘అనవసర వ్యయాల తగ్గింపు చర్యల కోసం పేలవమైన పనితీరుతో సామూహిక తొలగింపును సమర్దించుకోవడం మోసపూరితం’’ అని న్యాయమూర్తి విలియం అల్సప్ వ్యాఖ్యానించినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం నివేదించింది. ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన శాన్‌ఫ్రాన్సిస్కో‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అల్సప్.. ట్రెజరీ, వెటరన్స్ అఫైర్స్, అగ్రికల్చర్, డిఫెన్స్, ఎనర్జీ, ఇంటరీయర్ విభాగాల్లో అన్యాయంగా తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విధుల్లోకి తీసుకోవాల్సిందేనని ఆయన ఆదేశించారు.


‘పనితీరు పేరుతో మన ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగులను తొలగించడం చాలా విచారకరం.. ఇది చాలా మోసపూరితం’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిధుల తగ్గింపు, వేలాది ఉద్యోగుల తొలగింపు వంటి నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌)ను ఏర్పాటుచేసిన ట్రంప్.. దానికి సారథిగా ఎలాన్ మస్క్‌ను నియమించిన విషయం తెలిసిందే.


ఎలాన్ మస్క్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు.. ఆయన నిర్ణయాలకు ఆమోదముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తొలగింపునకు మస్క్ చేసిన ప్రతిపాదనలపై ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు. అయితే, వీటిపై పలు అమెరికా ఫెడరల్ కోర్టులు స్టే విధిస్తున్నాయి. అధ్యక్షుడు నిర్ణయాలను న్యాయమూర్తులు తప్పుబడుతున్నారు.


కాగా, ఇటీవల మస్క్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫెడరల్‌ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా మార్చడంలో భాగంగా ఈ చర్య తప్పదని ఆయన అన్నారు. అయితే, మస్క్ తీరుపై అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన జోక్యం ఎక్కువైందని, ట్రంప్‌ను ఓ కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన డోజ్.. అనేక విభాగాలకు బడ్జెట్లలో ఇప్పటికే కోత విధించింది. విదేశాలకు యూఎస్‌ ఎయిడ్‌ కింద అందజేస్తోన్న సాయాన్ని కూడా నిలిపివేసి.. పలు ఏజెన్సీలను మూసేసింది. విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు బేరీజు వేసే స్వతంత్ర పరిశోధన సంస్థ విద్యా శాఖ కాంట్రాక్టుల విభాగానికి నిధులను ఏకంగా 100 కోట్ల డాలర్ల మేర తగ్గించేందుకు సిద్ధమయ్యింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com