ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.100 కోట్ల విలువ గల భూమికే ఎసరు

Crime |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 11:21 PM

హైదరాబాద్‌లో కొంతమంది నకిలీ డాక్యుమెంట్లతో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి యత్నించారు. రెవెన్యూ అధికారులు దీనిని గుర్తించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే ఆధారంగా భూమిని ప్రభుత్వ స్థలంగా ప్రకటించారు.. బాధ్యులపై కేసులు నమోదు చేశారు. 2001లో నిర్వహించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే మ్యాప్‌ను ఆధారంగా తీసుకుని ప్రస్తుత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు రెవెన్యూ అధికారులు. సదరు భూమి యూఎల్‌సీ భూమి అని నిర్ధారించి.. ఆ స్థలంపై బోర్డు ఏర్పాటు చేశారు.


హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు కొందరు అక్రమార్కులు పన్నిన పన్నాగాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొంతమంది మోసగాళ్లు పన్నిన కుట్రను తెరపై తెచ్చారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసులు నమోదు అయ్యాయి.


కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 48 లో ఉన్న 5,800 గజాల యూఎల్‌సీ (Urban Land Ceiling) భూమి, పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం జీడిమెట్ల పేట్ బషీరాబాద్ గ్రామ పరిధిలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. స్థానిక ఎమ్మెల్సీ ప్రోద్బలంతో కొంతమంది అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. వారు నకిలీ డాక్యుమెంట్లను తయారుచేసి హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మునిసిపల్ డెవలప్మెంట్ అథారిటీ) నుండి 15 ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతులు పొందారు.


ఈ పరిస్థితిని గుర్తించిన రెవెన్యూ అధికారులు.. 2001లో నిర్వహించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే మ్యాప్‌ను ఆధారంగా తీసుకుని ప్రస్తుత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ వివరాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు నివేదించిన తరువాత.. సదరు భూమి యూఎల్‌సీ భూమి అని నిర్ధారించారు. అధికారులు వెంటనే ఈ స్థలంపై బోర్డు వేసి.. అది ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. ఈ చర్యతో సదరు భూమి కబ్జా కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చెబుతూ.. రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.


ఫిర్యాదులో పేర్కొన్న బాధితులు రతన్ కుమార్, శ్రీనివాసరావు, శేఖర్ బాబు, వెంకట్రావు, సతీష్ బాబు, జిష్ణు ఇన్ఫ్రా కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థలపై కేసులు నమోదు చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైగా ఉండటంతో.. ప్రాధాన్యతను సంతరించుకుంది. అదృష్టవశాత్తు.. రెవెన్యూ అధికారులు , జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టడంతో.. స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో.. జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి.. ప్రభుత్వ భూమిని కాపాడినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com