ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం.. 2024-25 సంవత్సరానికిగానూ.. ఫిబ్రవరి 28, 2025 వరకు 9.11 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు తమ ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేశారు. మొత్తం రిజిస్టర్డ్ యూజర్ల సంఖ్య 13.96 కోట్లుగా ఉండగా.. దీంట్లో 65 శాతం కంటే ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇక వీటిల్లో 8.56 కోట్ల వరకు టాక్స్ రిటర్న్లు ఈ-వెరిఫై పూర్తయింది. ఆదాయపు పన్ను శాఖ రూ. 3.92 లక్షల కోట్ల రిఫండ్ను జారీ చేసింది. సాధారణంగానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు.. చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తే.. ఐటీ శాఖ ఆ మొత్తాన్ని ఇ-వెరిఫై చేసిన తర్వాత రిఫండ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. దాదాపు 40 శాతం మంది యూజర్లు.. పన్ను శాఖ అందించిన యుటిలిటీని ఉపయోగించి రిటర్న్స్ ఫైల్ చేశారు.
ఇక ఇదే సమయంలో ఎంత ఆదాయం ఉన్న వారు.. ఎంత మంది టాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారనే వివరాల్ని కూడా వెల్లడించింది. కోటి రూపాయల నుంచి రూ 5 కోట్ల వరకు ఆదాయం ఉన్న వారిలో టాక్స్ పేయర్స్ 3.89 లక్షల మంది ఉన్నారు. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 43,004 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. మొత్తంగా ఇక్కడ రూ. కోటికి మించి ఆదాయం ఉన్న వారు.. 4,68,658 మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు.
రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 1.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. గుజరాత్లో 87.90 లక్షల మంది, ఉత్తరప్రదేశ్లో 90.68 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో 44.45 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 30.76 లక్షల మంది టాక్స్ పేయర్స్ ఉన్నారు. పంజాబ్లో 43.79 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. భారతదేశం వెలుపల నుంచి 87,501 మంది రిటర్న్స్ ఫైల్ చేశారు.
ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఐటీ రిటర్న్స్ -1 ఫైల్ చేసే వారి సంఖ్య 0.11 శాతం పెరిగింది. ఐటీ రిటర్న్స్ -2 ఫైల్ చేసే వారి సంఖ్య 33.89 శాతం పెరిగింది. ఐటీ రిటర్న్స్ -3 ఫైల్ చేసే వారి సంఖ్య 15.50 శాతం పెరిగింది. ఐటీ రిటర్న్స్ -6 ఫైల్ చేసే వారి సంఖ్య 5.59 శాతం పెరిగింది. ఐటీ రిటర్న్స్ -5 ఫైల్ చేసే వారి సంఖ్య 6.46 శాతం పెరిగింది.
![]() |
![]() |