మరోసారి దిగ్గజ కార్ల తయారీ సంస్థలు ధరల పెంపుపై ఒక్కొక్కటిగా ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు మరో దిగ్గజ కంపెనీ.. మారుతీ ప్రత్యర్థిగా ఉన్న దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ వెహికిల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా అదే బాటలో పయనించింది. తన వాణిజ్య వాహన శ్రేణిలో సుమారు 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆటోమోటివ్ రంగంపై ప్రభావం చూపుతున్న.. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ పెంపు అవసరమని కంపెనీ తెలిపింది.
''భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, ఈరోజు తన వాణిజ్య వాహన శ్రేణిలో 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది, ఇది ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.'' అని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. మోడల్, వేరియంట్ను బట్టి ధరలు మారుతుంటాయని టాటా మోటార్స్ పేర్కొంది.
కొంత కాలంగా భారతీయ ఆటో పరిశ్రమ.. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, అధిక లాజిస్టిక్స్ ఖర్చులు, సరఫరా గొలుసు (సప్లై చెయిన్) అంతరాయాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ధరలు పెంచడం అనివార్యమవుతోంది. ఖర్చుల్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పెరుగుతున్న ఖర్చుల్లో కొన్నింటిని కస్టమర్లకు బదిలీ చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.
ఇందులో భాగంగానే.. మొదట ఇప్పుడు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్.. 2025 ఏప్రిల్ నుంచి వాహన ధరల్ని 4 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక్కడ కూడా.. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కారణంగా పేర్కొంది. ఇక మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ బాటలోనే ఇతర కార్ల తయారీ కంపెనీలు కూడా కార్ల ధరల్ని పెంచే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. టాటా గ్రూప్లో భాగమైన టాటా మోటార్స్.. కార్లు, యుటిలిటీ వాహనాలు, పికప్లు, ట్రక్కులు, బస్సులకు ప్రసిద్ధి చెందింది. టాటా మోటార్స్ షేర్ ధర మార్చి 17న 0.70 శాతం పెరిగి రూ. 660.10 వద్ద స్థిరపడింది.
![]() |
![]() |