వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై నమోదు చేసిన తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించాలని ముంబై నటి/మోడల్ కాదంబరి జెత్వానీ ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న పది సెల్ఫోన్లను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కుక్కల విద్యాసాగర్, సజ్జన్ జిందాల్ కలిసి ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్తో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం విజయవాడలో మహిళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు సుంకర పద్మశ్రీ, బొల్లినేని కీర్తి, రమాదేవి, దుర్గాభవానీలతో కలిసి జెత్వానీ విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత తనకు న్యాయం చేయాలని.. తప్పుడు కేసుల కారణంగా తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించినా పురోగతి లేదని, ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదని.. తనను వేధించిన నిందితులపై చర్యలు తీసుకోలేదని.. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారకుడైన విద్యాసాగర్ మాత్రం బెయిల్పై యథేచ్ఛగా తిరుగుతున్నాడని.. అతడిని వెనుక నుంచి సజ్జనే నడిపిస్తున్నాడని ఆరోపించారు.
![]() |
![]() |