ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 50 ఏళ్లకు పింఛన్లు..! మండలిలో మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 05:58 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికిు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా 50 ఏళ్లకే పింఛన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.


ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు శాసనసభ, ఇటు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటంతో నిస్సారంగా సాగుతున్నాయి. అయితే మండలిలో మాత్రం వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రశ్నలు, సమాధానాలతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 50 ఏళ్లకే పింఛన్ హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు.. ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే 50 ఏళ్లకు పింఛన్ మంజూరుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.


మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తుచేశారు. తొలిసారిగా పింఛన్ల పంపిణీ మొదలు పెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే 2014లో వేయి రూపాయలుగా ఉన్న పింఛను.. రెండు వేలకు పెంచామని గుర్తుచేశారు. వృద్ధాప్య పింఛన్లతో పాటుగా ట్రాన్స్‌జెండర్లు, మత్స్యకారులకు కూడా పింఛన్లు అందిస్తున్నామన్నారు.


రాష్ట్రంలో పింఛన్లు తగ్గించలేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తీసివేసినట్లు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలలో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందించే విషయంపైనా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ వేయి రూపాయిలు పెంచేందుకు ఐదేళ్లు తీసుకుందని.. తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com