మహిళ రొమ్ములను తాకడం, ప్యాంటు జిప్పు తీయడం అత్యాచారం కిందకు రాదంటూ ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతోంది. తాజాగా, దీనిపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి (Annapurna Devi) తీవ్రంగా మండిపడ్డారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న ఆమె.. .దానిని పరిశీలించాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ఇలాంటి తీర్పులతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయని, తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. నవంబరు 2021 నాటి పోక్సో కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన తీర్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ బాలికపై లైంగిక వేదింపులకు పాల్పడిన నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. కేసు వివరాల్లోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి 2011 నవంబరు 10న బంధువుల ఇంటి నుంచి తన గ్రామానికి తిరిగొస్తోంది. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన పవన్, ఆకాశ్, అశోక్ అనే ముగ్గురు యువకులు బైక్ వస్తూ.. వారిని ఇంటికి దగ్గర దింపుతామని ఆఫర్ చేశారు. తన కుమార్తెను మాత్రం వారి బైక్ ఎక్కించి పంపిన ఆమె.. నడుచుకుటూ వెళ్లింది. మార్గమధ్యంలో మైనర్ బాలికపై ఆ యువకులు అత్యాచారానికి యత్నించారు. అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక కేకలు విని అటుగా వెళ్తున్నవారు అక్కడకు చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. . కింది కోర్టులో నిందితులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలోనే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమవుతోంది. కేంద్ర మంత్రితో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జూన్ మలియా, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్లు విమర్శలు గుప్పించారు. ఇది దురదృష్టకరమని, తీర్పు తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు.. నిందితులు చేసిన చర్యను అత్యాచారంగా ఎందుకు పరిగణించలేరు? ఈ తీర్పు వెనుక ఉన్న తర్కం నాకు అర్థం కాలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి’ అని స్వాతి మలివాల్ అన్నారు.
నిందితులు ప్యాంటు నాడాలు విప్పిదీసి.. బాలిక ఒంటిపై దుస్తులను విప్పదీయడానికి ప్రయత్నించినా అత్యాచార యత్నం కాదని.. ఈ కేసు చట్టపరమైన పరిమితిని అందుకోలేదని న్యాయమూర్తి చెప్పడం సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. "సిద్ధం కావడం. నేరం చేయడానికి వాస్తవ ప్రయత్నం మధ్య వ్యత్యాసం ఉంటుంది అని కోర్టు వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa