ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో హోలీ రోజున భారీగా నగదు బయటపడింది. ఆ రోజున ఆయన బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించడంతో పోలీసులు, ఫైర్ రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతుండగా.. భారీ ఎత్తున కరెన్సీ కట్టలు వెలుగుచూశాయి. ఇది లెక్కలో చూపని నగదుగా అధికారులు గుర్తించారు. దీనిని తీవ్రంగా పరగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. అత్యవసరంగా కొలీజయం సమావేశం ఏర్పాటుచేశారు. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. 2021లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వర్మ.. దీనికి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు.
కాగా, కొలీజియంలో కొంతమంది సభ్యులు... ఆయన కేవలం బదిలీ సరిపోదని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడటానికి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలని కోరడమో, అంతర్గత విచారణ నిర్వహించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఢిల్లీలో లేరు. ప్రమాదం గురించి ఆయన కుటుంబసభ్యులే ఎమర్జెన్సీ సేవల విభాగానికి సమాచారం ఇచ్చారు. అయితే, తన బంగ్లాలో నగదు లభ్యం కావడంపై ఆయన ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం. అంతేకాదు, శుక్రవారం ఆయన కోర్టుకు కూడా రాలేదని, సెలవుపై ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ సంఘటన ప్రతిఒక్కర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది అరుణ్ భరద్వాజ్ దీని గురించి ప్రస్తావించగా... చీఫ్ జస్టిస్ పై విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా, 2008 ఆగస్టు 13న పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ జిత్ కౌర్ నివాసంలో రూ.15 లక్షల నగదుతో ఉన్న బాక్స్ కలకలం రేపింది. ఈ నగదు మరో న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్కు ఇవ్వాల్సింది కానీ పొరపాటున జస్టిస్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. సీబీఐ విచారణ అనంతరం 2011లో ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ యాదవ్పై అభియోగాలు నమోదయ్యాయి. .
కాగా, జస్టిస్ వర్మ వ్యవహారం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని చర్యలు తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, హైకోర్టు న్యాయమూర్తిపై చర్యలకు సంబంధించిన 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని అనుసరించి సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీ విచారణ జరిపి.. నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa