ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.15 వేల జీతగాడికి.. రూ.34 కోట్లు కట్టాలని ఐటీ నోటీసు!

national |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:57 PM

మొన్న జ్యూస్ అమ్ముకునే వ్యక్తికి రూ.7.8 కోట్లు.. నిన్న ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడికి రూ.11 కోట్ల చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు (ఐటీ నోటీసు) పంపిన సంగతి మరిచిపోకముందే.. నేడు మరో నిరుపేదకు కోట్ల రూపాయలు కట్టాలని నోటీసులు పంపిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తోన్న అతడికి.. రెక్కాడితే గానీ డొక్కాదు. నెలకు జీతం రూ.15 వేలు అయితే.. రూ.34 కోట్లు పన్ను చెల్లించాలని ఐటీ అధికారులు నోటీసులు పంపారు. దీంతో బాధితుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన జీతమే 20 వేలులోపు అయితే .. నాకు రూ.34 కోట్లకు నోటీసు రావడం ఏంటి? అని పోలీసుల దగ్గరకు పరుగెత్తుకెళ్లాడు.


 ఆగ్రాకు చెందిన కరణ్‌కుమార్ (29) ఎస్బీఐ బ్రాంచ్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి నెలకు రూ.15 వేలు జీతంగా వస్తోంది. మార్చి 29న అతడికి ఐటీ శాఖ నోటీసు జారీచేసి... రూ.34 కోట్ల పన్ను కట్టాలని పేర్కొంది. ఐటీ శాఖ నుంచి వచ్చిన నోటీసులో ఏముందో అతడికి ముందు అర్ధం కాలేదు. తోటివారి సాయంతో అందులోని వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి .. తన పాన్ కార్డు వివరాలను ఎవరో దుర్వినియోగం చేశారని అనుమానం వ్యక్తం చేశాడు.


కరణ్ గతంలో పనిచేసిన యజమానికి తన పాన్ వివరాలు ఇచ్చినట్టు చెప్పాడు. వాటిని ఎవరో వాడుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నాడు. బాధితుడు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘ఆగ్రాలోని ఖైరా ఏరియా ఎస్బీఐ బ్రాంచ్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాను.. నాకు నెలకు రూ.15 వేలు జీతం.. 2021లో నేను కాంట్రాక్ట్ పద్దతిలో చేరాను.. ఐటీ నోటీసులపై పోలీసులకు ఫిర్యాదు చేశాను... 2019లో నేను నొయిడాలోని ఓ ప్రయివేట్ కంపెనీలో చేరాను.. అక్కడ యాజమాన్యం పాన్ కార్డు సహా కొన్ని పత్రాలు తీసుకుంది’’ అని చెప్పారు. అలీగఢ్ ఐటీ అధికారి నైన్ సింగ్ మాట్లాడుతూ.. కరణ్ పాన్ కార్డు ఐటీ సిస్టమ్‌లో రిజిస్టర్ అయి ఉందని, దీని పేరున భారీగా లావాదేవీలు జరగడంతో నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa