శ్రీ తాళ్లపాక అన్నమయ్య 516వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 31వ తేదీ టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 5.30 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ''సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం'' నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. టిటిడి ఉన్నతాధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.